ఆమె ఆరోపణలు నిజమేనా?: నటుడు బాలాజీని విచారించిన పోలీసులు..
హైదరాబాద్: సినీ నటుడు బాలాజీ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ నటి లక్ష్మి మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాలాజీ భార్యకు కిడ్నీ దానం చేసిన తనకు కేవలం రూ.3లక్షలు ముట్టజెప్పి చేతులు దులుపుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.20లక్షల ఒప్పందం మేరకే తాను కిడ్నీ ఇవ్వడానికి అంగీరించానని, కానీ బాలాజీ మాత్రం తనను మోసం చేశారని చెప్పారు.
ఈ నేపథ్యంలో లక్ష్మి ఫిర్యాదుపై జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. బాలాజీని స్టేషన్ కు పిలిపించి వివరాలు సేకరించారు. కిడ్నీ మార్పిడి, బాధితురాలి నుంచి కిడ్నీ సేకరణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా లక్ష్మి చేసిన ఆరోపణలను బాలాజీ ఖండించినట్టు తెలుస్తోంది.
తాము చట్ట ప్రకారమే లక్ష్మి నుంచి కిడ్నీ తీసుకున్నామని అందుకు తగిన డాక్యుమెంట్లను బాలాజీ పోలీసులకు అందజేసినట్టు సమాచారం. కిడ్నీ తీసుకునే ముందు ఆరుగురు డాక్టర్ల బృందం సర్టిఫై చేయాల్సి ఉంటుందని ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా చేయించుకున్నట్లు పోలీసులకు తెలిపారు.
కాగా, తనకు రూ. 20 లక్షలు ఇస్తామని, తన తమ్ముడికి ఉద్యోగం ఇప్పిస్తామని, తనకు సిని మాల్లో వేషాలు ఇప్పిస్తానని చెప్పినందునే తాను కిడ్నీ ఇచ్చేందుకు ఒప్పుకున్నానని నటి లక్ష్మి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు రావాల్సిన డబ్బుల గురించి ఫోన్ చేస్తే బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని, దీనిపై నటి శ్రీరెడ్డితో కలిసి మానవ హక్కుల కమిషన్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, 'మా' అసోసియేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు.
నటి లక్ష్మి, నటుడు బాలాజీల వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన నిజానిజాలను వారు త్వరలోనే చేధించే అవకాశం ఉంది.