‘మా డబ్బుతో మేం తాగుతాం! మీకేంటి?’: పోలీసులకు షాకిచ్చిన తల్లీకొడుకు
హైదరాబాద్: నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడమంటే పోలీసులకు ఓ సవాలుగానే మారుతోంది. మద్యం మత్తులో వచ్చే వాహనదారులు పోలీసులకు చుక్కలు చూపిస్తుంటారు. బ్రీత్ ఎనలైజర్ టెస్టుకు సహకరించకుండా ముప్పు తిప్పలు పెడుతుంటారు. తాజాగా, పోలీసులకు ఓ వింత అనుభవం ఎదురైంది.
ఆ వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 11న రాత్రి రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఎస్సై ఇబ్రహీం సిబ్బందితో కలిసి ఆరాంఘర్ చౌరస్తాలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ వాహనదారుడికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
అదే సమయంలో శంషాబాద్ మండలం రషీద్ గూడకు చెందిన చెన్నమ్మ, ఆమె కొడుకు శ్రీశైలం కాలినడకన వెళ్తున్నారు. మద్యం మత్తులో ఉన్న చెన్నమ్మ, శ్రీశైలంలు అక్కడే ఉన్న పోలీసులను బూతులు తిట్టారు. అంతేగాక, 'మా డబ్బుతో మేం తాగితే మీకేంటి?' అంటూ వాగ్వాదానికి దిగారు.
ఎస్సై ఇబ్రహీం ఎంత వారించినా వినకపోవడంతో రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. చెన్నమ్మ, శ్రీశైలంలపై కేసు నమోదు చేసి అక్కడ్నుంచి పంపించేశారు. సోమవారం వారిద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించినట్లు పోలీసులు ఎస్ఐ నారాయణ రెడ్డి తెలిపారు.