కత్తి కార్తీకపై చీటింగ్ కేసు: 52 ఎకరాల భూ వివాదంపై.. రూ.కోటి తీసుకున్నారని..
దుబ్బాక ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేశాయి. తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నాయి. తమను గెలిపిస్తే అభివృద్ది చేస్తామని చెబుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీతోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థి కత్తి కార్తీక కూడా బరిలో ఉన్నారు. ప్రచార పర్వంలో ఆమె కూడా దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో కార్తీకపై చీటింగ్ కేసు నమోదవడం కలకలం రేపుతోంది.
కత్తి కార్తీకపై కేసు
కత్తి కార్తీకపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేశారు. ఓ భూ వివాదం సెటిల్ చేస్తానని కార్తీక మోసం చేశారని పోలీసులు తెలిపారు. ఇందుకోసం కార్తీక రూ. కోటి తీసుకున్నారని వారు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. చీటింగ్పై కార్తీక.. ఆమె అనుచరులపై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామని పోలీసులు వెల్లడించారు.
52 ఎకరాల భూమి
అమీన్పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ప్రైవేట్ కంపెనీకి ఇప్పించేందుకు కత్తి కార్తీక మధ్యవర్తిత్వం చేశారట. ఈ మేరకు బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బాధితుడి వద్ద కార్తీక, అనుచరులు రూ. కోటి నగదును సెక్యూరిటీ డిపాజిట్ చేయించుకున్నారని చెబుతున్నాడు. కానీ భూ వివాదం సెటిల్ కాలేదు కదా.. తన డబ్బులు ఇవ్వడం లేదని చెప్పాడు. కత్తి కార్తీక నుంచి తన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నాడు. ఈ కేసుపై కత్తి కార్తీక స్పందించాల్సి ఉంది.
చీటింగ్ కేసు
దుబ్బాక బై పోల్ ప్రచారంలో ఉన్న కత్తి కార్తీకకు చీటింగ్ కేసు నెగిటివ్ కానుంది. క్యాంపెయిన్ చేస్తోన్న ఆమెపై కేసు నమోదవడం ప్రతికూలంశంగా మారనుంది. కానీ కార్తీక మాత్రం ప్రచారంలో నిమగ్నమయ్యారు. చీటింగ్ కేసుపై స్పందించలేదు. మరోవైపు దుబ్బాకలో కత్తి కార్తీకను అధికార పార్టీ బరిలోకి దింపిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓట్లను చీల్చేందుకు పోటీలో నిలిపారనే ప్రచారం జరిగింది. కానీ ఇంతలో కేసు నమోదవడం కలకలం రేపుతోంది.
అబ్బే అదేం లేదే..
కత్తి కార్తీక మద్దతుదారులు మాత్రం దీనిని తప్పుపడుతున్నార. అధికార పార్టీ సపోర్ట్ ఉంటే తమపై కేసు ఎలా నమోదవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇదీ కావాలని చేస్తోన్న రాజకీయం అని మండిపడ్డారు. కార్తీక ఎవరినీ మోసం చేయలేదు అని చెబుతున్నారు. ఇంత ప్రచారం చేసినా.. జనం విశ్వసించరని చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నందుకే కేసుల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. కానీ దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచార పర్వం మరింత హీటెక్కింది.