Disha case encounter: నిందితుల శవాలు కుళ్లిపోతున్నాయంటూ హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: ఏడుగురు సభ్యులతో కూడిన జాతీయ మానవ హక్కుల సంఘం బృందం శనివారం దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించింది. ఈ మేరకు వివరాలను శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. అంతకుముందు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీలో ఉన్న నలుగురు నిందితుల మృతదేహాలను పరిశీలించిందని తెలిపారు.
Disha case encounter: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే కీలక వ్యాఖ్యలు
వివరాలు తెలుసుకున్న ఎన్హెచ్ఆర్సీ..
జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) బృందానికి సీనియర్ ఎస్పీ నేతృత్వం వహిస్తున్నారని డీసీపీ ప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఆ బృందంలో ఫోరెన్సిక్ నిపుణుడు కూడా ఉన్నారని చెప్పారు. ఘటనకు సంబంధించి వారు తమ దగ్గర వివరాలు మాత్రమే తీసుకున్నారని వెల్లడించారు. వారు మీడియాతో మాట్లాడే వీలు లేనందున వాళ్ల తరపున తనను మాట్లాడమన్నారని పేర్కొన్నారు.
విచారాణాధికారిగా అదనపు డీసీపీ..
కాగా, దిశ నిందితుల ఎన్కౌంటర్పై విచారణాధికారిగా రాచకొండ అదనపు డీసీపీ సురేందర్ రెడ్డి నియమితులయ్యారు. చటాన్పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్పై ఆయన దర్యాప్తు జరుపనున్నారు. కాగా, షాద్నగర్ సమీపంలో నవంబర్ 27న వెటర్నరీ వైద్యురాలిపై మహ్మద్ ఆరిఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు అత్యాచారం చేసి, అనంతరం ఆమెపై పెట్రోలు పోసి హత్య చేశారు. ఈ క్రమంలో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం.. క్రైమ్ సీన్ రీకన్ స్ట్రక్చన్ చేస్తుండగా వారు దాడి చేసి, పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో కాల్చి చంపేశారు.
నిందితుల మృతదేహాలు కుళ్లిపోతున్నాయంటూ..
దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్కౌంటర్లో చనిపోయిన నలుగురు మృతదేహాలు కుళ్లిపోతున్నాయని, వాటిని వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మహబూబ్నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9 వరకు మృతదేహాలను ఖననం చేయవద్దని, వాటిని భద్రపర్చాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో వాటిని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంచారు.
లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం..
కాగా, మహబూబ్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపరచే వసతులు లేవని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఇప్పటికే మృతదేహాలు డీకంపోస్ అయ్యాయని తెలిపారు. మరో వైపు కుటుంబసభ్యులు కూడా తమ వారి మృతదేహాలను ఇవ్వాలని కోరుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశాలున్నందున ఇక్కడి నుంచి తరలించేలా ఆదేశాలివ్వాలని జిల్లా ఎస్పీ దాఖలు చేసిన పిటిషన్లో కోరారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి..
మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి దిశ కేసు నిందితుల మృతదేహాలను శనివారం రాత్రి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. గుట్టుచప్పుడు కాకుండా ఈ పనిచేశారు. మళ్లీ ఏదైనా శాంతిభద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉండటంతో ఈ విషయంలో పోలీసులు గోప్యత పాటించినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేకపోవడంతో గాంధీ ఆస్పత్రికి మృదేహాలను తరలించినట్లు తెలుస్తోంది.