ఘట్కేసర్ ఘటన : ఎన్నెన్నో ట్విస్టులు.. ఇంకా వీడని చిక్కుముడి.. సీన్రీకన్స్ట్రక్షన్లో ఏం తేలిందంటే..
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థినిపై అఘాయిత్యం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో మొదట ఆటో డ్రైవర్ల పాత్రపై అనుమానాలు వ్యక్తం కాగా.. పోలీసుల విచారణలో వారికి సంబంధం లేదని తేలింది. అంతేకాదు,యువతిని అసలెవరూ కిడ్నాప్ చేయలేదని పోలీసులు గుర్తించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అసలు యువతిపై అత్యాచారం జరిగిందా లేదా... జరిగితే అది ఎవరి పని వంటి ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకాల్సి ఉంది. అనుమానితులతో పోలీసులు సీన్-రీకన్స్ట్రక్షన్ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు...
యువతి చెప్పిన వివరాల ప్రకారం నలుగురు ఆటో డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారితో సీన్-రీకన్స్ట్రక్షన్ చేశారు. అయితే యువతి చెప్తున్న వివరాలకు క్షేత్ర స్థాయి వాస్తవాలకు పొంతన కుదరట్లేదని గుర్తించారు. దీంతో యువతి పేర్కొన్న ప్రాంతాల్లో మరిన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆశ్చర్యంగా.. ఘటన జరిగినరోజు సాయంత్రం 6గంటల నుంచి 7.30గంటల వరకూ ఆ యువతి ఘట్కేసర్,యంనంపేట,అన్నోజిగూడా తదితర ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్లు వాటిల్లో స్పష్టంగా రికార్డయింది.
ఆటోడ్రైవర్లకు సంబంధం లేదు...
అనుమానితులుగా భావిస్తున్న ఆటోడ్రైవర్ల సెల్ఫోన్ సిగ్నల్స్ ఆ ప్రాంతాల్లో ఎక్కడా లేవని గుర్తించారు. దీంతో బాధిత యువతిని పోలీసులు మరోసారి ప్రశ్నించారు. దీంతో ఆ యువతి.. 'చీకటి పడినా ఇంటికి రావట్లేదని తల్లి నుంచి పదేపదే ఫోన్ కాల్స్ వస్తుండటంతో ఆటోడ్రైవర్ ఎక్కడికో తీసుకెళ్లాడని..' చెప్పినట్లు పోలీసులతో వెల్లడించింది. దీంతో ఈ కేసులో ఆటోడ్రైవర్లకు సంబంధం లేదని తేలిపోయింది. ఒకరకంగా పోలీసులను యువతి తప్పుదోవ పట్టించినట్లయింది.
అత్యాచారం జరిగిందా?
ఆటోడ్రైవర్లకు సంబంధం లేదని తేలడంతో.. మరి ఈ కేసులో అసలు నిందితులెవరు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అత్యాచారం జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించినట్లు తెలుస్తుండగా... ఇప్పటివరకూ దానికి సంబంధించిన ఆధారాలైతే లభ్యం కాలేదు. దీంతో యువతిపై అసలు అత్యాచారం జరిగిందా లేదా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు యువతి మానసిక స్థితిపై కూడా పోలీసులకు అనుమానం కలుగుతోంది. ఈ విషయంపై గతంలో యువతితో సన్నిహితంగా మెలిగిన ఓ యువకుడిని ఆరా తీశారు.
మానసిక స్థితిపై అనుమానాలు...
ఆ యువతితో సన్నిహితంగా మెలిగిన రోజుల్లో ఒకరోజు ఆమె తనకు ఫోన్ చేసి... ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పిందని ఆ యువకుడు పోలీసులకు వెల్లడించాడు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తేలిందన్నాడు. దీంతో పోలీసులకు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. సాయంత్రం సమయంలో ఆ యువతి ఆయా ప్రాంతాల్లో ఒంటరిగా ఎందుకు సంచరించింది... అసలు యువతిపై అత్యాచారం జరిగిందా లేదా అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.