డబ్బుల పంపిణీ ఫైట్: రేపు సెలవు, గ్రేటర్ ఎన్నికకు సర్వం సిద్ధం (పిక్చర్స్)
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు భాగ్యనగరం సర్వం సిద్ధమైంది. ఆదివారం వరకు ప్రచారంలో బిజీగా గడిపిన పార్టీలు విశ్రాంతి తీసుకున్నాయి! అయితే, ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని, మభ్య పెడుతున్నారని, బెదిరిస్తున్నారని పరస్పరం పార్టీలు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
నిజాంపేట, కృష్ణా నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో అధికార, విపక్షాల నేతల మధ్య వాగ్యుద్ధం జరిగింది. టిఆర్ఎస్ ఓటర్లకు డబ్బులు, మద్యం పంచుతోందని విపక్షాలు ఆరోపించాయి. విపక్షాలే పంచుతున్నాయని అధికార పార్టీ ఆరోపిస్తోంది.
కూకట్ పల్లి, కృష్ణా నగర్లో తెరాస నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ టిడిపి నేతలు కొందరిని పోలీసులకు అప్పగించారు. డబ్బులు పంచిన వారిని అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే గాంధీ రోడ్డు పైన బైఠాయించారు. ఈ సందర్భంగా టిడిపి, టిఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది.
డబ్బులు పంచుతున్నారని తాను ఫిర్యాదు చేస్తే, తన పైనే కేసు పెట్టారని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే ఎన్వీవీఎస్ ప్రభాకర్ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం సమక్షంలో ఎన్నికలు జరగాలని ఎమ్మెల్సీ రామచంద్ర రావు డిమాండ్ చేశారు. తెరాస కార్యాలయంపై బిజెపి దాడి చేసిందని హయత్ నగర్ తెరాస నేతలు ఆరోపిస్తున్నారు.
హబ్సిగడ, కూకట్ పల్లి, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య కూడా వాగ్వాదం జరిగింది. పరస్పరం దాడులకు కూడా పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. హయత్ నగర్ తెరాస కార్యాలయంపై బిజెపి నేతలు దాడి చేశారని తెరాస ఆరోపిస్తోంది. కాగా, మంగళవారం ఉదయం పది గంటలకు గవర్నర్ నరసింహన్ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
గ్రేటర్ ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాదులో 150 వార్డులు, దాదాపు 74లక్షల మంది ఓటర్లు మంగళవారం జరిగే పోలింగ్లో ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారు. దాదాపు 50 వేలమంది సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటారు.
గ్రేటర్ ఎన్నికలు
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 2న సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది.
గ్రేటర్ ఎన్నికలు
ఎన్నికల విధులకు హాజరయ్యే ఇతర జిల్లాల ఉపాధ్యాయులకు (గ్రేటర్ పరిధికి బయట ఉన్నవారు) ఫిబ్రవరి మూడున ఆన్డ్యూటీతో కూడిన సెలవును ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ, కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.
గ్రేటర్ ఎన్నికలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఇప్పటికే ఓటింగులో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించారు. మంగళవారం ఉదయం ఆఫీసులకు ఆలస్యంగా వెళ్లేందుకు లేదా విధులనుంచి తొందరగా వెళ్లిపోయేందుకు వెసులుబాటు కల్పించారు.
గ్రేటర్ ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాదులో మొత్తం ఓటర్లు.. 74,23,980. అందులో పురుషులు.. 39,69,007, మహిళలు.. 34,53,910, ఇతరులు 1,163 ఉన్నారు.
గ్రేటర్ ఎన్నికలు
మొత్తం వార్డులు 150 ఉన్నాయి. ఎస్టీ 2, (జనరల్-1, మహిళ-1), ఎస్సీ 10 (జనరల్-5, మహిళ-5), బీసీ 50 (జనరల్-25, మహిళ-25), మహిళా జనరల్ -44, అన్ రిజర్వుడు 44 ఉన్నాయి.
గ్రేటర్ ఎన్నికలు
మొత్తం పోలింగ్ కేంద్రాలు 7,802 ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల లొకేషన్లు 3,117. సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 1,987, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలు 867, క్లిష్టమైన పోలింగ్ కేంద్రాలు 382, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 36 ఉన్నాయి.
గ్రేటర్ ఎన్నికలు
మొత్తం పోలింగ్ సిబ్బంది సంఖ్య 46,545. 150 డివిజన్లకు రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్లు మొత్తం 24 ఉన్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్, ఒక సహాయక ప్రిసైడింగ్ అధికారితోపాటు మరో ముగ్గురు సిబ్బంది కలుపుకొని మొత్తం ఐదుగురు ఉద్యోగులుంటారు.
గ్రేటర్ ఎన్నికలు
1,500 మంది మైక్రో అబ్జర్వేటర్లను నియమించారు. 3,000 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు వెబ్కాస్టింగ్లో శిక్షణ ఇచ్చారు. ఫిబ్రవరి 5న నిర్వహించే ఓట్ల లెక్కింపునకు 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
గ్రేటర్ ఎన్నికలు
ఓట్ల లెక్కింపునకు 893 టేబుళ్ల ఏర్పాటు చేస్తారు. 3,200మంది కౌంటింగ్ సిబ్బంది నియామకం జరిగింది. బీఎల్వోల ద్వారా ఓటర్ చిట్టీల పంపిణీ, వెబ్సైట్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
గ్రేటర్ ఎన్నికలు
16 మందికన్నా అధికంగా అభ్యర్థులు పోటీలో ఉన్నవి.. జంగమ్మెట్ (28మంది అభ్యర్థులు), సూరారం (21), ఈస్ట్ ఆనంద్బాగ్ (18), రామంతాపూర్(17), బాలానగర్(17). ఒక్కో ఈవీఎంలో 16 మంది సభ్యుల బ్యాలెట్ అమర్చే ఆస్కారం ఉంటుంది. దీంతో ఈ వార్డుల్లో రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది.
గ్రేటర్ ఎన్నికలు
16 మంది అభ్యర్థులు పోటీలో ఉన్న వార్డులు... చైతన్యపురి, ఓల్డ్ బోయిన్పల్లి, 15మంది అభ్యర్థులు పోటీలో ఉన్న వార్డులు... లింగోజిగూడ, సుభాష్నగర్, మల్కాజ్గిరి, 13 మంది పోటీ చేస్తున్న వార్డులు.. వెంగళరావునగర్, మూసాపేట్, నేరేడ్మెట్, రాంనగర్.
గ్రేటర్ ఎన్నికలు
11 వార్డుల్లో 12 మంది చొప్పున, 15 వార్డుల్లో 11మంది చొప్పున, 18 వార్డుల్లో 10 మంది చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అతి తక్కువగా నలుగురు మాత్రమే అభ్యర్థులు పోటీలో ఉన్న వార్డులు.. ఛావ్నీ, నవాబ్సాహెబ్కుంట, సులేమాన్ నగర్, దత్తాత్రేయనగర్, గోల్కొండ, నానల్నగర్, అహ్మద్నగర్, చందానగర్.
గ్రేటర్ ఎన్నికలు
మంగళవారం నాటి జిహెచ్ఎంసి కార్పొరేషన్ ఎన్నికల కోసం అంతా సిద్ధం చేసినట్టు జిహెచ్ఎంసి కమిషనర్ జనార్ధన్ రెడ్డి సోమవారం తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించామని పేర్కొన్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
గ్రేటర్ ఎన్నికలు
ప్రతి వార్డుకు జోనల్ అధికారులను నియమించామన్నారు. ప్రతి పోలింగ్ బూత్లో ఐదుగురు సిబ్బందితోపాటు అదనంగా మరొకరిని నియమిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కోసం వెయ్యి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
గ్రేటర్ ఎన్నికలు
ఓటు వేసేందుకు వచ్చేవారు తప్పనిసరిగా ఓటరు గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు. అది లేకుంటే డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, ఇతర గుర్తింపు కార్డులు తీసుకురావాలని తెలిపారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.