కొండా కార్యాలయంపై పోలీసు జులుం : నోటీసుల పేరుతో దౌర్జన్యం, సరికాదన్న చేవెళ్ల ఎంపీ
హైదరాబాద్ : చేవెళ్ల ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్షగట్టింది. ఇటీవల వరుసగా జరుగుతోన్న పరిణామాలు అందుకు అద్దం పడుతోన్నాయి. మంగళవారం మరోసారి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కార్యాలయంలో పోలీసులు ప్రవేశించారు. సందీప్ రెడ్డి అనే వ్యక్తికి నోటీసులు ఇవ్వాలని వచ్చి గుచ్చి గుచ్చి ప్రశ్నించడం వేధింపులు అని అర్థమవుతోంది.
నోటీసుల పేరుతో బెదిరింపులు
నోటీసులు వచ్చిన పోలీసులు .. అక్కడున్న ఉద్యోగులను ప్రశ్నించారు. సందీప్ రెడ్డి గురించి ఉద్యోగులను గుచ్చి గుచ్చి మరీ అడిగారు. సందీప్ .. మీకు తెలుసా, ఆయన వివరాలు చెప్పాలని ఉద్యోగులను ఎస్సై కృష్ణా ఇబ్బంది పెట్టారు. ఎస్పై తీరును గమనించిన కొండా .. నోటీసుల పేరుతో వచ్చి ఇవ్వకుండా, ప్రశ్నించడం ఏంటని మండిపడ్డారు.
ఎస్సై తీరుపై సీపీకి ఫిర్యాదు
నోటీసుల పేరుతో వచ్చి చూపించమని అడిగితే ఇవ్వకపోవడం ఏంటని కొండా ప్రశ్నించారు. అదీ కాకుండా ఎంపీనైనా తనను వేలెత్తి చూపించడం ఏంటని నిలదీశారు. ఎస్సై తీరుపై పోలీసు కమిషనర్ కు ఫోన్ లో చెప్పారు కొండా. దీంతో ఎస్సైని అక్కడినుంచి వెళ్లిపోవాలని సీపీ .. ఆదేశించారు. సీపీ ఆదేశించినా ఎస్సై దౌర్జన్యం చేశారని కొండా కార్యాలయ సిబ్బంది బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఎస్సై తీరుపై ఫిర్యాదు చేశారు.
వీడియో ఎవిడెన్స్ ఉంది
తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మా వద్ద అన్ని వీడియో ఎవిడెన్స్ ఉన్నాయయని పేర్కొన్నారు. పోలీసులు ఎలాంటి సెర్చ్ కాపీ లేకుండా, ఆదేశాలు లేకుండా నేరుగా కార్యాలయంలోకి రావడం ఏంటని కొండా ప్రశ్నించారు. తమపై పోలీసులు కావాలని ఈ విధంగా వ్యవహరిస్తున్నారు .. దీనిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు కొండా.