గంజాయి మత్తులో బీటెక్ విద్యార్థులు: నాగోల్ అపార్ట్మెంటులో కలకలం, 9మంది అరెస్టు
హైదరాబాద్: రాజధానిలో జడలు విప్పుకున్న డ్రగ్ భూతం నీడలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఓవైపు టాలీవుడ్ ను డ్రగ్స్ షేక్ చేస్తుంటే.. మరోవైపు నగరంలోని పలు చోట్ల డ్రగ్ రాకెట్ ఉనికి బయటపడుతోంది.
తాజాగా నాగోల్ లోని ఎన్విరాన్ టవర్స్లో కొంతమంది బీటెక్ స్టూడెంట్స్ డ్రగ్స్ వాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అపార్ట్ మెంటులోని ప్లాట్ నం.349లో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు తీసుకుంటున్న9మంది బీటెక్ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
'డ్రగ్' రాకెట్లో మరో కోణం: వెలుగుచూసిన లోకల్ బ్రాండ్, తీసుకుంటే చిత్తే!
పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఒక ఎల్ఎల్బి విద్యార్థి కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారి తల్లిదండ్రులను నాగోల్ పోలీస్ స్టేషన్కు పిలిపించి పోలీసులు వివరాలు తెలుసుకుంటున్నారు.
ఇలా వెలుగులోకి?:
అపార్ట్ మెంటులో నిర్వహించే కమిటీ మీటింగ్ లో బ్యాచిలర్స్ గురించి ప్రస్తావన వచ్చింది. అపార్ట్ మెంటులోని కొన్ని ఫ్లాట్స్ లో బ్యాచిలర్స్ ఉంటుండం.. వారి ప్రవర్తన పట్ల కొంత అనుమానం ఉండటంతో దీని గురించి చర్చించారు. సమావేశానికి స్థానిక ఎస్ఐ కూడా రావడంతో.. ఒకసారి బ్యాచిలర్స్ ను కూడా పిలిస్తే బాగుంటుందని వారి ఫ్లాట్స్ వద్దకు వెళ్లారు. ఫ్లాట్ నం.309 తలుపు తట్టగానే.. ఒక విద్యార్థి డోర్ తెరిచాడు.డోర్ తీయడమే ఆలస్యం డ్రగ్స్ తరహా వాసన వారి ముక్కు పుటాలు అదిరిపోయేలా చేసింది.
Recommended Video
లోపలికెళ్లి తనిఖీ చేస్తే!:
ఫ్లాట్ లోపలంతా పొగ నిండిపోయి ఉండటం, సిగరెట్ వాసనలా కాకుండా భరించలేని రీతిలో దాని వాసన ఉండటంతో ఎస్ఐకి అనుమానం వచ్చింది. దీంతో లోపలికెళ్లి చూడగా.. విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్లు తేలింది. ఫ్లాటులో రెండు గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 30వరకు బీర్ బాటిల్స్ కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. విద్యార్థులంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నట్లుగా గుర్తించారు. పట్టుబడ్డ సమయంలో వారంతా మత్తులోనే ఉన్నట్లు గుర్తించారు.
బ్యాచిలర్స్పై అనుమానం:
కొంతమంది బ్యాచిలర్స్ డ్రగ్స్ కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో వారికి గదులు అద్దెకు ఇవ్వడానికి కూడా వెనుకాడాల్సిన పరిస్థితి తలెత్తింది. చదువుకుంటున్న పిల్లలు కదా అని గదులు అద్దెకిస్తే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఎన్విరాన్ టవర్స్లో ఉంటున్న టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఒకరు వాపోయారు. వీరి వల్ల మంచివారిని కూడా అనుమానించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఇంటి పక్కనే జరుగుతున్నా!:
నగర జీవితమంటేనే బిజీ లైఫ్ కావడంతో.. పక్కనవారు ఏం చేస్తున్నారో తెలుసుకునే తీరిక ఎవరికీ లేకుండా పోయింది. ఇదే ఆసరాగా చేసుకుని కొంతమంది బ్యాచిలర్స్ ఇలా డ్రగ్స్ కార్యకలాపాలకు తెరలేపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
తల్లిదండ్రులకు దూరంగా ఉంటుండం, ఇంటినుంచి పాకెట్ మనీ వస్తుండటంతో.. వీరి వ్యసనాల గురించి ఇంట్లో వాళ్లకు కూడా తెలియడం లేదు.
తాజాగా పట్టుబడిన విద్యార్థులు ఎన్విరాన్ టవర్స్ అపార్ట్ మెంటులో దాదాపు నాలుగు నెలల క్రితం నుంచి ఉంటున్నారు. తమ పక్కనే ఉన్నా.. వీరు ఇలాంటి పనులు చేస్తున్నారని ఊహించలేదని అపార్ట్ మెంటులోని కొంతమంది వాపోతున్నారు.