ఆధార్ నోటీసుల వ్యవహారంలో కొత్త కోణం : తప్పుడు పత్రాలతో ఆధార్ పొందిన 127 మంది రోహింగ్యాలు
Recommended Video
హైదరాబాద్లో ఆధార్ నోటీసుల వ్యవహారంలో కొత్త కోణం వెలుగుచూసింది. పాతబస్తీకి చెందిన కొంతమంది బ్రోకర్ల సహాయంతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో 127 మంది రోహింగ్యా ముస్లింలు ఆధార్ కార్డు పొందినట్టు తేలింది. తప్పుడు పత్రాలతో కొందరు ఆధార్ కార్డులు పొందారంటూ తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే.. 127 మందికి ఆధార్ నోటీసులు జారీ చేసింది. సత్తార్ ఖాన్ అనే వ్యక్తి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్టు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 127 మందికి మాత్రమే నోటీసులు అందినట్టు చెబుతున్నప్పటికీ.. హైదరాబాద్లో దాదాపు 1000 మందికి నోటీసులు జారీ అయ్యాయన్న ప్రచారం ఉంది. త్వరలోనే ఆ వివరాలు కూడా బయటకొచ్చే అవకాశం ఉందంటున్నారు.
సత్తార్ ఖాన్కు ఈ నెల 2వ తేదీన నోటీసులు జారీ అయినట్టు సమాచారం. ఆ తర్వాత మిగతావారికి కూడా నోటీసులు జారీ చేశారు. నిజానికి గురువారం(ఫిబ్రవరి 20)న వీరందరు బాలాపూర్లోని మేఘన గార్డెన్స్కు వచ్చి విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆధార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. పౌరసత్వాన్ని నిరూపించుకునే ఒరిజినల్ ధ్రువ పత్రాలతో రావాలని ఆదేశించింది. అయితే అనివార్య కారణాలతో మే నెలకు దీన్ని వాయిదా వేసింది. అయితే పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఆధార్ కోరడం సంచలనంగా మారింది.
అయితే అధికారులు మాత్రం ఆధార్ వెరిఫికేషన్లో భాగంగా ఇలా నోటీసులు ఇవ్వడం సాధారణమేనని అంటున్నారు. పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు UIDAIకి లేదన్నారు. మరోవైపు ఆధార్ కార్డు తీసుకున్నందుకు పౌరసత్వం నిరూపించుకోవాలని అడగటం ఏమిటని సత్తార్ ఖాన్ లాయర్ ముజఫరుల్లా ఖాన్ ప్రశ్నించారు. ఇలాంటి నోటీసులు చాలామందికి వచ్చాయన్నారు. త్వరలో దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తామన్నారు.
ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తీవ్ర స్థాయిలో స్పందించిన సంగతి తెలిసిందే. ఆధార్ నోటీసులు అందుకున్న 127 మందిలో ముస్లింలు, దళితులు ఎంతమంది ఉన్నారని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఆధార్ సంస్థ తన అధికారాలను దుర్వినియోగం చేసిందని, సరైన ప్రామాణికాలు అనుసరించకుండానే పక్షపాత వైఖరితో వ్యవహరించిందని ఆరోపించారు.