రాజయ్య ఇంట్లో కోడలు, మనవళ్ల మృతి: ప్రమాద కారణాలపై పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్: మాజీ ఎంపీ, వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య నివాసంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఆయన కోడలు సారిక, మనువళ్లు అభినవ్, ఆయోన్, శ్రీయోన్లు మృతి చెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు, ఏఎస్పీ జానయ్య ఘటనాస్థలిని పరిశీలించారు. పోలీసు జాగిలాల సాయంతో ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు.
రాజయ్య నివాసంలోని మొదటి అంతస్థులో ప్రమాదం జరిగింది. మొదటి అంతస్థు నుంచి ఉదయం 6.30గంటల వరకు కూడా పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కోడలు సహా ముగ్గురు మనువళ్లు మృతిచెందడంతో రాజయ్య కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
రాజయ్య కుమారుడు, సారిక భర్తను ప్రశ్నించిన పోలీసులు
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజయ్య కుమారుడు అనిల్ను రెండు దఫాలుగా ప్రశ్నించారు. మంగళవారం రాత్రి ఏం జరిగింది, ఆసమయంలో ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, గతంలో చోటు చేసుకున్న పరిణామాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు రాజయ్య నివాసం వద్దకు భారీగా తరలి వస్తున్నారు.
కాగా, కాంగ్రెసు వరంగల్ లోకసభ అభ్యర్థి రాజయ్య కోడలు సారికకు చాలా కాలంగా కుటుంబ సభ్యులతో గొడవలున్నాయి. రాజయ్య కుమారుడు అనిల్ సారికను 2006 ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత అనిల్ సారికకు దూరంగా ఉంటున్నాడు.
అతను ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదని స్థానికులు అంటున్నారు. తన మామ రాజయ్య, భర్త అనిల్ తనను వేధిస్తున్నారంటూ సారిక గతంలో ఇంటి ముందు ధర్నా కూడా చేశారు. రాజయ్య పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కాలంలో ఇది జరిగింది. రాజయ్య కుటుంబ సభ్యులపై 498 సెక్షన్ కింద సారిక కేసు కూడా పెట్టారు.
రాజయ్య, ఆయన భార్య మాధవి, కుమారుడు అనిల్ ఒక ఇంట్లో ఉంటారని, సారిక తన ముగ్గురు పిల్లలతో మరో ఇంట్లో ఉంటారని తెలుస్తోంది. సారిక, ఆమె ముగ్గురు పిల్లల సజీవ దహనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటే శవాలు వంటింట్లో ఉండాలని అంటున్నారు.
ఇంటికి కూడా ఏ విధమైన భారీ నష్టం జరగలేదని అంటున్నారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదని స్థానికులు అంటున్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో ఇంట్లో గొడవలు మాత్రం లేవని పనిమనిషి అంటోంది.