వంశీచంద్ రెడ్డితో గొడవ: విష్ణువర్ధన్ రెడ్డికి నోటీసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై దాడి చేసిన కేసులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ వివాదంలో పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 37 మంది సాక్ష్యులను ప్రశ్నించారు.
ఈనెల 12వ తేదీన ఓ వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా, ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి ఇద్దరూ రాజీకి వచ్చేందుకు నిరాకరించారు. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అన్నట్లుగా ఇద్దరూ పట్టుపడుతున్నట్లు సమాచారం. విష్ణు, వంశీచంద్ రెడ్డి పరస్పర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి బుధవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. 37మంది ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాన్ని మాదాపూర్ పోలీసులు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు విష్ణు సహా కొంతమంది దాడి చేసినట్లు గుర్తించారు. దాంతో విష్ణుకు నోటీసులు ఇచ్చారు.
విష్ణువర్ధన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి ఆ రోజు పరస్పరం దాడులకు పాల్పడి, సవాళ్లు కూడా విసురుకున్నారు. తన తప్పేమీ లేదని వంశీచంద్ రెడ్డి చెబుతుండగా, తనపై దాడికి పురికొల్పాడని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.