మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు: కేసు నమోదు చేయని పోలీసులు
హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత మహేశ్వరరెడ్డి ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిస్తోల్ను గాల్లోకి లేపి కాల్పులు జరిపిన ఫోటోలను పలు పత్రికలు ప్రచురించిన సంగతి తెలిసిందే.
వీటిని ఆధారంగా చేసుకుని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నిర్మల్లో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఇంద్రకరణ్ రెడ్డి చట్టానికి వ్యతిరేకంగా కాల్పులు ఎలా జరుపుతారని ప్రశ్నించారు.
నిబంధనలకు విరుద్ధంగా గాల్లోకి కాల్పులు జరిపిన ఇంద్రకరణ్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. అయితే రెండు రోజులు గడుస్తున్నా, పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.
విజయదశమి సందర్భంగా నిర్మల్లో తన కుటుంబ సభ్యులతో మంత్రి ఆయుధ పూజ చేసిన చేశారు. అనంతరం తన ఇంటి ఆవరణలో రెండు రౌండ్లు గాల్లోకి కాల్చారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మరోవైపు, మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ జితేందర్ రెడ్డి కాల్పుల చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.