ఏకే-47 మాయమైన ఘటనపై సీరియస్, అప్పటి ఎస్సై సహా ఐదుగురి సస్పెన్షన్, గోడ గొడవతో వెలుగులోకి..
ఏకే 47 మాయమైన ఘటనలో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అప్పటి హుస్నాబాద్ ఎస్సై సంజయ్ సహా సంపత్, మణెమ్న, మనోజ్, అశోక్ను సస్పెండ్ చేశారు. మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. సిద్దిపేట జిల్లాలో సదానందం అనే వ్యక్తి ఏకే-47తో కాల్పులు జరపడంతో తుపాకీ మాయమైన సంగతి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. స్టేషన్లో గన్ మాయంపై విచారణ జరిపి.. బాధ్యులను సస్పెండ్ చేశారు.
ఏకే-47 మాయం..
నెల క్రితం సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో గోడ నిర్మాణం విషయంలో వివాదం చెలరేగడంతో సదానందం అనే వ్యక్తి ఏకే 47తో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. దీంతో అతనికి తుపాకీ ఎక్కడిదీ, మావోయిస్టులతో సంబంధం ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి. చివరికి హుస్నాబాద్ పోలీసు స్టేషన్లో మాయమైన ఏకే-47 సదానందం వద్ద ఉందని నిర్ధారణ అయ్యింది. స్టేషన్లో ఏకే-47 చోరీ విషయాన్ని ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు జరుపగా.. స్టేషన్ నుంచి తుపాకీ తాను తీసుకెళ్లానని సదానందం అంగీకరించారు. అప్పటి ఎస్పై సంజయ్తోపాటు ఐదుగురిని సస్పెండ్ చేశారు.
ఇలా వెలుగులోకి..
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో సదానందం, గంగరాజు పక్క పక్కనే ఇల్లు. వారిద్దరూ దూరపు చుట్టాలు కూడా. గత నెలలో గంగరాజు తల్లితో సదానందానికి గొడవ జరిగింది. ఇంటి పక్కన గల ఇటుకల విషయంలో ఘర్షణ పడ్డారు. ఇంటి పక్కన గోడ పెట్టాలని వాగ్వివాదం జరిగింది. మాట మాట పెరగడంతో రాత్రి 9 గంటల సమయంలో సదానందం తన వద్ద ఉన్న ఏకే 47 తీసుకొచ్చాడు. అంతకుముందే ఇంట్లో ఒకసారి ఫైర్ చేశాడు. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. తర్వాత గంగరాజుపై కాల్పులు జరపడంతో తృటిలో తప్పించుకున్నారు. తర్వాత తుపాకీ తీసుకొని సదానందం పారిపోయాడు.
రెప్పపాటులో మిస్..
రాత్రి 9 గంటల సమయంలో లైట్ ఆర్పివేసే పడుకొనే సమయంలో సదానందం కాల్పులు జరిపాడని గంగరాజు చెప్పారు. రెప్పపాటులో కాల్పుల నుంచి తప్పించుకున్నానని వివరించారు. సదానందంతో, అమ్మ గొడవ పడిందని.. ఇటుకల విషయంలో గొడవ జరిగిందని చెప్పారు. చిన్న విషయాన్ని ఇంత పెద్దగా ఎందుకు చేశాడో అర్థం కావడం లేదన్నారు. తర్వాత సదానందం పోలీసులకు లొంగిపోయి.. తానే తుపాకీని దొంగిలించానని ఒప్పుకున్నాడు.