కలకలం: గ్యాంగ్స్టర్ నయీంతో పోలీసు అధికారుల విందు పార్టీల ఫొటోలు లీక్
కొంతమంది పోలీసు అధికారులకు నయీంతో సంబంధాలున్నట్లు రుజువులు లభించాయి. ఈ మేరకు ఓ తెలుగు వార్తా ఛానల్తోపాటు తెలుగు మీడియాలో కథనాలు ఫొటోలతో సహా ప్రసారమయ్యాయి.
హైదరాబాద్: ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్స్టర్ నయీం వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. కొంతమంది పోలీసు అధికారులకు నయీంతో సంబంధాలున్నట్లు రుజువులు లభించాయి. ఈ మేరకు ఓ తెలుగు వార్తా ఛానల్తోపాటు తెలుగు మీడియాలో కథనాలు ఫొటోలతో సహా ప్రసారమయ్యాయి.
ఆ కథనాల మేరకు వివరాలిలా ఉన్నాయి.. సీఐడీ డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావు నయీంతో చర్చలు జరుపుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. వాళ్లిద్దరూ కలిసి ఓ రెస్టారెంటులో భోజనం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటో బయటకు వచ్చింది. ఆయన గతంలో కీలకమైన విభాగాల్లో ఎస్ఐ స్థాయి నుంచి పనిచేశారు.
నయీంతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్కౌంటర్ జరగడానికి కొంత కాలం ముందు నయీం హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఆయన ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తూ, పోలీసుల సమాచారాన్ని నయీంకు అందజేస్తూ అతడికి రక్షణగా ఉండేవారని ఆరోపణలున్నాయి.
నయీంకు సంబంధించిన వ్యక్తుల వివరాలను కూడా పోలీసుశాఖలో తన పలుకుబడి ద్వారా సేకరిస్తూ వాటిని నయీంకు చేరవేసేవారంటున్నారు. మద్దిపాటి శ్రీనివాసరావుపై గతంలో అనేక సందర్భాల్లో ఆరోపణలొచ్చినా, సరైన సాక్ష్యాధారాలు దొరకలేదు. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో ఆధారాలు బయటకు రావడంతో ఇక ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. కాగా, 16మంది పోలీసులు నయీంకు సహకరించినట్లు సమాచారం.
ప్రస్తుతం సీఐడీలోనే ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వచ్చాయి. ఆయన గతంలో నల్గొండ జిల్లాలో పనిచేశారు. ఇంత స్పష్టమైన ఆధారాలు బయటకు రావడంతో మరోసారి నయీం కేసు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ కూడా ఈ ఫొటోలను ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
కాగా, తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించి పోలీస్ ఎన్ కౌంటర్లో మరణించిన నయీంతో పోలీసులు, రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధాలు లేవని తెలంగాణ ప్రభుత్వం, సిట్.. హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే.