హజీపూర్ ఘటనతో కళ్లు తెరిచిన పోలీసులు..! అమ్మాయిల మిస్సింగ్ కేసులపై నజర్..!!
హైదరాబాద్ : హాజీపూర్ లో ఓ మానవ మ్రుగం సాగించిన దారుణ మారణ కాండతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. అభం శభం తెలియని అమ్మాయిలకు లిఫ్ట్ ఇచ్చే క్రమంలో ఆ ఉన్మాది కొనసాగించిన మరణ మ్రుదంగం చేసిన ఆర్తనాదాలు యావత్ సమాజాన్ని మేల్కొలిపింది. సభ్య సమాజం మద్య, మానవ రూపంలో ఇలాంటి జంతువులు కూడా ఉంటరనే చేదు వాస్తవాన్ని కర్కోటకుడు శ్రీనివాస రెడ్డి నిరూపించాడు. అతడు అమ్మాయిల పట్ల సాగించిన అమానుష క్రీడకు ఇంకెంతమంది బలయ్యారనే దిశగా పోలీసులు ఆరా తీస్తున్నారు. మిస్సయిన అమ్మాయిల చిట్టా ముందుపెట్టుకుని విచారణ జరుపేందుకు పోలీసు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
ఈజీగా హత్యలు , అత్యాచారాలు.. ఫేస్బుక్ నిండా అమ్మాయిలు.. శ్రీనివాస్ రెడ్డి రాక్షస జీవితం (వీడియో)
హాజీపూర్ ఘటనతో మేల్కొన్న పోలీసుశాఖ..! తప్పిపోయిన అమ్మాయిలపై విచారణ..!!
మిస్సింగ్ కేసులు.. చాలా పోలీస్టేషన్లలో అవి పెండింగ్ కేసుల జాబితాకెక్కుతున్నాయే తప్ప.. అసలు తప్పిపోతున్న అమ్మాయిలు, చిన్నారులెక్కడున్నారు? ట్రాఫికింగ్ ముఠాల చేతికి చిక్కారా? లేక ఎవరైనా వారిని ట్రాప్ చేసి హతమార్చారా? అనే కోణంలో దర్యాప్తు సాగడం లేదు. ఇదే ట్రాఫికింగ్ ముఠాలకు, సీరియల్ కిల్లర్లకు అనుకూలంగా మారుతోంది. హజీపూర్ ఉదంతం తర్వాత ఒళ్లుగగుర్బొడిచే నిజాలు ఒకటొక్కటిగా వెలుగు చూశాయి. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.
మిస్సింగ్ కేసులపై టాస్క్ఫోర్స్..! అప్రమత్తమైన పోలీసులు..!!
తప్పిపోయారనుకున్న చిన్నారులను సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డి చిదిమేశాడని తేలింది. దీంతో.. ఇకపై మిస్సింగ్ కేసుల విషయంలో తాత్సారం చేయకూడదని పోలీసు శాఖ నిర్ణయించింది. మిస్సింగ్లను అత్యంత ప్రాధాన్య కేసుల జాబితాలో చేర్చనుంది. అదృశ్య కేసుల్లో దర్యాప్తు అధికారులు ఇకపై మెతక వైఖరిని అవలంబించకుండా ఒక పకడ్బందీ పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటుకు సిద్ధమైంది.
4 నెలలుగా కనిపించనివారిపై ప్రత్యేక ద్రుష్టి..! పాత కేసులను తోడుతున్న పోలీసులు..!!
చిన్నారులు, మహిళల భద్రత కోసం కమిషనరేట్ స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటైన మహిళా భద్రత విభాగం.. అదృశ్య కేసుల్లో (ముఖ్యంగా బాలికలు) దర్యాప్తును పర్యవేక్షించే బాధ్యతను చేపట్టింది. చిన్నారులపై అత్యాచారాలకు సంబంధించి ఏర్పాటైన ప్రత్యేక టాస్క్ఫోర్స్కు మిస్సింగ్ కేసుల బాధ్యతను కూడా అప్పగించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడ అదృశ్య కేసు నమోదైనా క్షణాల్లో హైదరాబాద్లోని మహిళా భద్రత విభాగం అధికారుల దృష్టికి వస్తుంది. ఆ తర్వాత.. కేసు దర్యాప్తు తీరును హైదరాబాద్ నుంచే పర్యవేక్షించడంతోపాటు దర్యాప్తు అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారు.
కేసుల దర్యాప్తుపై నిరంతర పర్యవేక్షణ..! న్యాయం చేయడమే లక్ష్యం అంటున్న పోలీసులు..!!
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఉన్న మిస్సింగ్ కేసులపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అన్ని స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలు సేకరిస్తున్నారు. 4 నెలలు, అంతకు మించి పెండింగ్లోనే ఉన్న మిస్సింగ్ కేసుల్ని తొలి ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించనున్నారు. పాత నేరస్థులపై నిఘా..అత్యాచారం, హత్యలకు సంబంధించి రెండు లేదా అంతకంటే ఎక్కువ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి జాబితాను పోలీసులు సిద్ధం చేస్తున్నారు. వారిపై నిరంతరం నిఘా కొనసాగించనున్నారు పోలీసులు.