గుట్టువిప్పిన రాజేష్, బలమైన సాక్ష్యాలు: 'అలాంటి స్వాతి ఇలా చేసిందా'
హైదరాబాద్: భర్త సుధాకర్ రెడ్డిని చంపిన కేసులో భార్య స్వాతిని పోలీసులు ఏ1గా మార్చే అవకాశముంది. గురువారం అరెస్టైన రాజేష్ను పోలీసులు గంటల పాటు విచారించారు. ఆయన చెప్పిన విషయాలు, అంతకుముందు విచారణలో స్వాతి చెప్పిన విషయాలను క్రోడీకరించుకున్నారు.
సుధాకర్ లేనప్పుడు.. వాళ్లింట్లోనే స్వాతితో: కొత్త కారులోను షికారు.. విచారణలో రాజేష్..
తొలుత రాజేష్ను ఏ1గా, స్వాతిని ఏ2 నిందితురాలిగా పేర్కొన్నారు. వీరిద్దరి విచారణ అనంతరం స్వాతిని తొలి నిందితురాలిగా మార్చనున్నారు. ఆమె చెప్పినట్లు తాను చేశానని రాజేష్ విచారణలో తెలిపాడు. హత్య ప్లాన్ కూడా చాలా రోజుల క్రితం వేసుకున్నట్లుగా తేలింది.
సుధాకర్ రెడ్డి కారు సీజ్, హత్యా స్థలానికి రాజేష్
పోలీసులు హతుడు సుధాకర్ రెడ్డి కారును స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన స్థలానికి రాజేష్ను తీసుకు వెళ్లిన పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం రాజేష్కు చికిత్సలు చేయించారు. అతనిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతనిని రిమాండుకు తరలించనున్నారు.
లోకల్ డాక్టర్ వద్ద మత్తు ఇంజెక్షన్ తెచ్చిన స్వాతి
రాజేష్కు ఒంటిపై చిన్న చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయి. తన భర్తను చంపుదామని నెలల క్రితమే నిర్ణయించుకున్న స్వాతి, ఆ తర్వాత అతనికి విషయం తెలియడంతో స్థానికంగా ఉన్న ఓ డాక్టర్ వద్ద మత్తు ఇంజెక్షన్ తెప్పించుకుంది. తన భర్తను చంపి మనం ఇక్కడి నుంచి పారిపోదామని ఆమె ప్రియుడు రాజేష్కు చెప్పినట్లుగా విచారణలో తేలింది.
ప్రధాన నిందితురాలు స్వాతి
సుధాకర్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితురాలు స్వాతేనని, రాజేష్ కాదని కొల్లాపూర్ పోలీసులు తెలిపారు. సుధాకర్ రెడ్డి, స్వాతి మధ్య కుటుంబపరమైన సమస్యలున్నాయని, రాజేష్పై ఆకర్షణ పెరిగాక స్వాతి సుధాకర్ రెడ్డిపై ద్వేషం పెంచుకుందని తెలిపారు.
హత్య ఎలా చేశామో వివరించిన రాజేష్
రాజేష్ను సుధాకర్ రెడ్డి ఇంటికి తీసుకు వెళ్లినప్పుడు తాము ఏ రకంగా హత్య చేశామో వివరించాడు. ఇనుప రాడుతో కొట్టి చంపినట్లు అంగీకరించాడు. హత్య అనంతరం రాజేష్ తన ముఖానికి పెట్రోల్ చల్లుకొని నిప్పంటించుకున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంట్లోనే పడేసిన రాడు, మత్తు మందు ఇచ్చేందుకు వినియోగించిన సిరంజీని స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీం సభ్యులు ఇంటి పరిసరాలను క్షుణంగా పరిశీలించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లారు.
పోలీసులతో పాటు ప్రజల పరుగు
కాగా, రాజేష్ను నాగర్ కర్నూలు తీసుకురావటంతో ప్రజలు వచ్చి ఆసక్తిగా చూశారు. విచారణ కోసం ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి పరుగులు తీశారు. రాజేష్ను పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చిన నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గేట్లు మూసివేశారు. లోపలికి ఎవరినీ అనుమతించలేదు. ఠాణాకు తెచ్చే సమయంలో, బయటికి తీసుకెళ్లే సమయంలో రాజేష్ ముఖానికి ముసుగు వేశారు. ఎవరితో మాట్లాడకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు.
స్వాతికి ఇంత నేర మనస్తత్వం ఎందుకు వచ్చింది
స్వాతి తన పట్ల ఆకర్షితురాలయిందని, అంతా ఆమెనే చేసిందని రాజేష్ విచారణలో వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో ఓ సాధారణ గృహిణిలా ఉంటున్న స్వాతికి ఇంత నేర మనస్తత్వం ఎలా వచ్చిందని పోలీసులు, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
బలమైన సాక్ష్యాలు లభ్యం
సుధాకర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే తాము అతనిని బెడ్ షీట్లో చుట్టి కారు డిక్కీలో వేసుకొని నవాబుపేట అటవీ మండలం ప్రాంతంలో దహనం చేసినట్లు చెప్పారు. స్వాతి, రాజేష్ విచారణ, ఆ తర్వాత పలు ఆధారాల నేపథ్యంలో సుధాకర్ రెడ్డి హత్య కేసులో పోలీసులకు బలమైన సాక్ష్యాలు లభ్యమైనట్లుగా తెలుస్తోంది.