న్యూఇయర్: పబ్స్పై దాడి, యువతీ-యువకుల అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పలు పబ్బుల పైన టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి తర్వాత దాడులు చేశారు. ఈ సందర్భంగా పబ్ నిర్వాహకులతో పాటు పలువురు యువతీ, యువకులను అదుపులోకి తీసుకున్నారు.
సమయం మించి పబ్లు నిర్వహిస్తుండటంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. 2015 కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాదులో పండుగ వాతావరణం కనిపించింది. అర్ధరాత్రి వరకు పబ్బులు, వీధులు, హోటళ్లు తదితరాలు వేడుకల్లో మునిగిపోయాయి.
అయితే, పోలీసులు ఒంటిగంట వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు. న్యూఇయర్ వేడుకలు ఒంటిగంట తర్వాత కూడా తెల్లవారుజాము వరకు నిర్వహించిన పబ్బుల పైన దాడులు చేశారు. మరోవైపు నూతన సంవత్సర వేడుకల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కూడాతప్పలేదు.
హైదరాబాదులో అర్ధరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారి పైన కేసులు నమోదు చేశారు. దాదాపు నాలుగు వందల మంది పైన కేసు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేశారు. పోలీసులు డ్రంగ్ అండ్ డ్రైవింగ్, న్యూఇయర్ వేడుకలు ఒంటి గంట వరకేనని ముందుగానే హెచ్చరించారు.