నయీం కేసులో ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్దం!?: కేసీఆరే ఆదేశాలిచ్చారా!?
నయీం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ ను విచారించిన పోలీసులు.. ఆయనతో పాటు మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ను సైతం అరెస్టు చేయబోతున్నారన్న వాదన వినిపిస్తోంది.
హైదరాబాద్: కొద్దిరోజులుగా స్తబ్దుగా మారిన గ్యాంగ్స్టర్ నయీం కేసు విచారణ మరోసారి స్పీడ్ అందుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు కొంతమంది నయీంతో అంటకాగారన్న ఆరోపణల నేపథ్యంలో.. ఇద్దరు టీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేయబోతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
నయీం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్ ను ఇప్పటికే విచారించిన పోలీసులు.. ఆయనతో పాటు మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ను సైతం అరెస్టు చేయబోతున్నారనేది ప్రస్తుతం బలంగా వినిపిస్తోన్న వాదన. వీరితో పాటు మరో 20మంది పోలీసులపై కూడా చర్యలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
నయీంకి అన్ని విధాల సహకరించిన మద్దిపాటి శ్రీనివాస్ (అడిషన్ ఎస్పీ, సీఐడీ), చింతమనేని శ్రీనివాస్ (సీసీఎస్ ఏసీపీ), మలినేని శ్రీనివాస్ (ఏసీపీ మీర్చౌక్), మస్తాన్ (సంగారెడ్డి ట్రాఫిక్ సీఐ), రాజ్గోపాల్ (సీఐ కొత్తగూడెం) తదితరులపై గురువారం నాడు వేటు పడింది.
పోలీస్ అధికారులపై వేటు పడిన నేపథ్యంలో.. ఆ తర్వాతి టార్గెట్ పొలిటిషియన్సే అన్న ఊహాగానాలు తెర పైకి వస్తున్నాయి. సీఎం కేసీఆర్ సైతం పోలీసులకు ఈ విషయంలో స్వేచ్చ ఇచ్చారని తెలుస్తోంది. ఆధారాలుంటే అధికార పార్టీ వారినైనా అరెస్టు చేసేందుకు ఆయన ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
కాగా, వేటు పడిన 25మంది పోలీసు అధికారులపై శాఖాపరమైన విచారణ జరగనుంది. విచారణలో గనుక అభియోగాలు రుజువైతే వీరిని విధుల నుంచి పూర్తి స్థాయిలో తొలగించడంతో పాటు కేసులు నమోదు చేసి జైలుకి పంపించే అవకాశం కూడా లేకపోలేదు.