మారుతీరావు సూసైడ్ నోట్లో ఏముంది.. భార్యా,బిడ్డలకు ఏం చెప్పాడు.. డ్రైవర్తో ఏం మాట్లాడాడు..?
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావు హైదరాబాద్ చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు మొదట ప్రచారం జరిగినా.. విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో ఓ ప్రముఖ న్యాయవాదిని కలిసేందుకు వచ్చి మారుతీరావు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నది ప్రస్తుతానికి మిస్టరీగా మారింది. ఘటనపై సైఫాబాద్ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మారుతీరావు గదిలో ఓ సూసైడ్ నోట్ దొరికినట్టు సమాచారం.
Recommended Video
మారుతీరావు సూసైడ్ నోట్
మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన గదిలో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 'గిరిజా క్షమించు.. అమృత మీ తల్లి వద్దకు వెళ్లిపో..' అంటూ భార్యాబిడ్డలను ఉద్దేశించి మారుతీరావు పేర్కొన్నట్టు తెలుస్తోంది. లేఖలో ఉన్న మిగతా వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై స్పందించేందుకు మారుతీరావు డ్రైవర్ నిరాకరించాడు. శనివారం నుంచి మారుతీరావు వెంట ఉన్నది డ్రైవర్ మాత్రమే. శనివారం రాత్రి 7.30గంటల ప్రాంతంలో ఇద్దరు కలిసి చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య భవన్కు చేరుకున్నారు.
డ్రైవర్తో ఏం చెప్పాడు..
కొంతకాలంగా హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటున్న మారుతీరావు.. చింతల్ బస్తీలోని ఆర్యవైశ్య భవన్లో ఎక్కువగా బస చేస్తున్నారు. అయితే ఎప్పుడొచ్చినా.. డ్రైవర్కు కూడా గది తీసుకునేవారు. కానీ ఈసారి డ్రైవర్ను కారులోనే పడుకోమని చెప్పి అతను గదిలో ఉండిపోయాడు. ఉదయం 8.30గంటలకు ఓ ప్రముఖ న్యాయవాదిని కలిసేందుకు వెళ్లాల్సి ఉందని.. ఆలోపు సిద్దంగా ఉండాలని చెప్పాడు. దీంతో ఉదయం 8గంటల సమయంలో డ్రైవర్ మారుతీరావు గదికి వచ్చాడు.
డ్రైవర్ వచ్చేసరికి విగతజీవిగా..
డ్రైవర్ వచ్చి మారుతీరావును నిద్ర లేపగా.. ఆయన నుంచి స్పందన లేదు. దీంతో అనుమానం వచ్చిన డ్రైవర్ ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని పిలిచాడు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే విగతజీవిగా పడివున్న అతన్ని విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. అనంతరం పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆత్మహత్య గురించి తెలుసుకున్న మారుతీరావు భార్య,ఆమె తరుపు బంధువులు అక్కడికి చేరుకున్నారు. భర్త మృతదేహాన్ని చూసి భార్య గిరిజ బోరున విలపించింది.
విషం తాగి బాటిల్ విసిరేసి ఉండవచ్చునని అనుమానాలు..
మారుతీరావు బంధువులతో మీడియా మాట్లాడే ప్రయత్నం చేయగా.. వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మారుతీరావు డ్రైవర్ కూడా మాట్లాడేందుకు నిరాకరించాడు. మారుతీరావు ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తుతోనే నిజాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. గదిలో విషం తాగిన తర్వాత.. బాటిల్ను కిటికీ నుంచి బయటకు పారేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
సోదరుడితో ఆస్తి వివాదాలే కారణమా.. లేక పశ్చాత్తపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్నెళ్ల క్రితం పీడి యాక్ట్ కేసులో విడుదలైనప్పటి నుంచి అమృతను మారుతీరావు వేధింపులకు గురిచేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి మొత్తం రాసిస్తానని రాయబారం పంపాడు. అయితే అమృత మాత్రం అతని ప్రలోభాలకు తలొగ్గలేదు. ఇదే క్రమంలో ఆస్తిని తన కొడుకుల పేరు మీద రాయాలని మారుతీరావు సోదరుడు ఒత్తిడి తెచ్చాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసుల విచారణలో ఏం తేలుతుందన్న ఉత్కంఠ నెలకొంది.