అక్బరుద్దీన్ కేసులో కోర్టు చెబితే కానీ కదలని పోలీసులు, కేసు నమోదు కరీంనగర్ ఖాకీలు
హైదరాబాద్ : ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలపై కోర్టు మొట్టికాయలు వేస్తే గానీ పోలీసుల్లో కదలిక రాలేదు. 15 నిమిషాల వ్యాఖ్యలపై బీజేపీ, ఆరెస్సెస్ భయపడ్డాయని ఇటీవల కరీంనగర్లో అక్బరుద్దీన్ కామెంట్ చేయడం వివాదాస్పదమైంది. అయితే అక్బరుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని కరీంనగర్ పోలీసులు క్లీన్ చీట్ ఇవ్వడంతో బీజేపీ నేతలు తప్పుపట్టారు. కోర్టులో పిటిషన్ వేయడంతో కరీంనగర్ కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
కేసు నమోదు
ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో కరీంనగర్ పోలీసులు స్పందించాల్సి వచ్చింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్పై ఐపీసీ 153 ఏ, 153 బీ, 506, సీఆర్పీసీ 156 (3) కింద కేసు నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశాలు జారీచేసింది. న్యాయస్థానం ఆదేశాలతో 24 గంటల్లోపే పోలీసులు కేసు నమోదు చేశారు. దీని కింద ఆయనకు నోటీసులు ఇస్తారు. విచారణకు హాజరుకాకుంటే అదుపులోకి తీసుకుంటారు.
ఇదీ విషయం ..
ఇటీవల కరీంనగర్లో ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. అతిథిగా హాజరైన అక్బరుద్దీన్ ఓవైసీ .. 15 నిమిషాల వ్యాఖ్యలను తిరగదొడారు. పోలీసులు లేకుంటే 15 నిమిషాల్లో 100 కోట్ల హిందువులను చంపేస్తానని పేర్కొన్నారు. తన ఈ వ్యాఖ్యలతో బీజేపీ, ఆరెస్సెస్ భయపడ్డాయని పేర్కొన్నారు. అయితే దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరలైంది. అయితే ఘటనపై విచారణ జరిపిన పోలీసులు .. అక్బరుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగం చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చారు. దీంతో మండిపడ్డ బీజేపీ నేతలు పోలీసుల తీరును తప్పుపట్టారు. జిల్లా బీజేపీ నేతలు కరీంనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా ఆధారంగా సమర్పించారు. ఆధారాలను సమర్పించిన న్యాయమూర్తి కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
అక్బర్ ఏమన్నారంటే ..
అయితే అంతకుముందు అక్బరుద్దీన్ మీడియాకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని పేర్కొన్నారు. తాను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించలేదని స్పష్టంచేశారు.ఒక వర్గాన్ని కించపరచలేదని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. ఒక వర్గాన్ని కించపరిచేటట్టు మాట్లాడలేదని వివరణలో పేర్కొన్నారు. తాను చట్టవిరుద్ధ ప్రకటన చేయలేదని తెలిపారు. కొందరు ఊహించుకొని తనపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. కావాలనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తాను చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఎవరికీనీ కించపరిచేటట్టు మాట్లాడలేదని తేల్చిచెప్పారు.