అందుకే చంపేశా..: నరేందర్, భార్గవి హత్య కేసులో కీలక విషయాలు..
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రియుడి చేతిలో హతమైన రిసెప్షనిస్ట్ భార్గవి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే హంతకుడు నరేందర్ గౌడ్ (25)తో పాటు అతనికి సహకరించిన తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు వారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టారు.
విషయం బయటకు పొక్కవద్దని..
మార్చి 3వ తేదీ సాయంత్రం.. మాట్లాడుదామని చెప్పి భార్గవిని బుజిలాపూర్ గ్రామంలోని తమ పొలం వద్దకు పిలిచాడు నరేందర్. అక్కడే ఆమెను హత్య చేసి ఇంటికి వచ్చాడు.
ఇంటికి వచ్చాక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో.. కొడుకును ఎలాగైనా ఈ కేసు నుంచి తప్పించాలని వారు భావించారు. మరునాడే నరేందర్ పెళ్లి కూడా ఉండటంతో విషయం బయటపడకూడదనుకున్నారు.
ఒంటిగంట నుంచి 3గం. మధ్యలో
విషయం బయటకు పొక్కితే నరేందర్ పెళ్లి రద్దవుతుంది కాబట్టి.. అదే రోజు రాత్రి నరేందర్ను తీసుకుని అతని తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడే పడి ఉన్న భార్గవి మృతదేహాన్ని గొయ్యి తీసి పూడ్చేశారు. రాత్రి ఒంటిగంట నుంచి మధ్యాహ్నాం 3 గంటల మధ్యలో ఈ హత్య జరిగినట్టు ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాస్ వెల్లడించారు.
తల్లిదండ్రులపై కేసు..
నరేందర్పై హత్యకేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అలాగే హత్యకు సంబంధించిన ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నించినందుకు అతడి తల్లిదండ్రులపై ఐపీసీ సెక్షన్ 201 కింద కేసు నమోదు చేశామన్నారు.
అందుకే చంపేశా.. :నరేందర్
భార్గవి హత్య కేసుపై చౌటుప్పల్ ఏసీపీ ఎస్ రమేశ్ మీడియాతో మాట్లాడారు. నిందితుడు నరేందర్ భార్గవితో తనకు సాధారణ సంబంధమే ఉందని చెప్పినట్టు వెల్లడించారు.
తనకు పెళ్లి జరుగుతున్న విషయం కూడా ఆమెకు ముందే తెలుసునని, పెళ్లిని అడ్డుకుంటానంటూ ఆమె హెచ్చరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని చెప్పినట్టు తెలిపారు. ఎక్కడ పెళ్లికి అడ్డుపడుతుందోనన్న భయంతోనే భార్గవిని హత్య చేసినట్టు నరేందర్ చెప్పాడన్నారు.