రూ.40 లక్షలు స్వాధీనం: శామీర్ పేట వద్ద తనిఖీలు, దుబ్బాక బై పోల్ కోసం తరలింపు, ఎవరిదంటే..
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడాన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ తరఫున మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారవడమే తరువాయిగా మిగిలింది. అయితే ఎన్నికల్లో ప్రలోభాల కోసం భారీగా నగదును తరలిస్తున్నారు. ఆ డబ్బును శామీర్ పేట వద్ద పోలీసులు పట్టుకున్నారు.
శామీర్పేట ఔటర్ రింగ్రోడ్డు వద్ద రూ.40 లక్షల నగదు పోలీసులకు పట్టుబడింది. తనిఖీలు నిర్వహిస్తుండగా నగదు లభ్యమయ్యిందని పోలీసులు తెలిపారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావుకు ఇచ్చేందుకే నగదు తీసుకెళ్తున్నట్లు బాలానగర్ డీసీపీ పద్మజ తెలిపారు. డబ్బు తీసుకొస్తున్న వారితో రఘునందన్రావు పీఏ ఫోన్ మాట్లాడిన ఆడియో గుర్తించామని వెల్లడించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బు తీసుకెళ్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు.
పటాన్చెరు నుంచి సిద్దిపేటకు డబ్బు తరలిస్తుండగా పట్టుకున్నామని పద్మజ పేర్కొన్నారు. అయితే దీనిపై రఘునందన్ రావు, బీజేపీ నేతలు స్పందించాల్సి ఉంది. కానీ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇంత మొత్తంలో నగదు పట్టుబట్టడం చర్చకు దారితీసింది. మరోవైపు నేతలు ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ఆరోపణలు-ప్రత్యారోపణలతో ఉప పోరు హీటెక్కింది. కరెక్టుగా ఈ సమయంలో నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది.
దుబ్బాకలో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత బరిలోకి దిగారు. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత.. ఆయన హఠాత్ మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బరిలో దిగబోతున్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్టు ప్రచార పర్వం సాగబోతోంది.