సీఎం స్వయంగా చెప్పినా.. పోలీసుల ఓవరాక్షన్..? ఇలా అయితే కష్టాలే..
తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటించినా చాలాచోట్ల ప్రజలు బయటకు వస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో రోడ్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనవసరంగా రోడ్ల పైకి వచ్చేవారి వాహనాలు సీజ్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో సహనం కోల్పోతున్న పోలీసులు.. జర్నలిస్టులు,నర్సులు,ఇతరత్రా అత్యవసర సేవల ఉద్యోగులపై కూడా జులుం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఖమ్మంలో మెడికల్ విద్యార్థిపై పోలీస్ దాడి
తాజాగా ఖమ్మంలో ఏసీపీ గణేష్ ఓ మెడికల్ కాలేజీ విద్యార్థినిపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోడ్లపై అనవసరంగా తిరుగుతున్నవారిని తిప్పి పంపుతున్న ఏసీపీ.. ఈ క్రమంలో ఓ మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆపారు. ఈ క్రమంలో ఆమెపై ఏసీపీ చేయి చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను తన ఐడీ కార్డు చూపించినా వినకుండా తనపై చేయి చేసుకున్నారని బాధితురాలు ఆరోపించారు. ఇరువురి మధ్య ఘర్షణ జరగడంతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనను మమతా కాలేజీ నర్సింగ్ స్టాఫ్ ఖండించారు. ఆసుపత్రి స్టాఫ్ అని చెప్పినా పలువురిపై దాడి చేశాడని ఆరోపించారు. ఉద్యోగాలకు వెళ్లాల్సిన అవసరం లేదు... ఇళ్లకు వెళ్లిపోండని హెచ్చరించినట్టు తెలిపారు.
సూర్యాపేటలో విధులు బహిష్కరించిన నర్సులు
సూర్యాపేటలోనూ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని ప్రభుత్వాసుపత్రి నర్సులు ఆరోపించారు. విధులకు వెళ్తున్నవారిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాము మెడికల్ స్టాఫ్ అని చెప్పినా వినిపించుకోవట్లేదన్నారు. ఇంత కష్టకాలంలోనూ సేవలు అందిస్తున్న తమ పట్లు దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ ప్రభుత్వాసుపత్రిలో నర్సులు విధులను బహిష్కరించారు.
జర్నలిస్టుపై దాడి
హైదరాబాద్లోనూ ఆదివారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రామంతాపూర్ విశాల్ సూపర్ మార్కెట్ వద్ద మెండు శ్రీనివాస్ అనే జర్నలిస్టుపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలున్నాయి. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. శ్రీనివాస్ను ఆపిన పోలీసులు ఎందుకు తిరుగుతున్నావంటూ అతనిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. జర్నలిస్ట్ ఐడీ కార్డు చూపించినా పోలీసులు వినిపించుకోలేదని,దురుసుగా ప్రవర్తించారని శ్రీనివాస్ వాపోయారు.
సీఎం స్వయంగా చెప్పినా..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మెడికల్ స్టాఫ్,జర్నలిస్టులు,పారిశుద్ధ్య కార్మికులు,ఇతరత్రా అత్యవసర సేవల సిబ్బందిని రోడ్ల పైకి అనుమతించాలని ఆయన చెప్పారు. కానీ కొన్నిచోట్ల పోలీసులు మాత్రం వారిని కూడా అడ్డుకుంటున్నారు. మిగతావాళ్ల సంగతి పక్కనపెడితే.. ఇలాంటి అత్యవసర సమయంలో మెడికల్ స్టాఫ్ను అడ్డుకుంటే సమస్య మరింత జటిలం అయ్యే అవకాశం ఉంది. సూర్యాపేటలో నర్సులు విధులను బహిష్కరించేదాకా వెళ్లిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టర్లు,నర్సులు తమ విధులను బహిష్కరిస్తే కరోనాను అడ్డుకోవడం ఇక ఎవరివల్లా కాదనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.