థర్డ్ డిగ్రీ ప్రయోగించి, బయటికి చెబితే బ్రోతల్ కేసు పెడతామంటారా?: కాంగ్రెస్ నాయకుల ధ్వజం
సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్లలో ఇసుక లారీలను అడ్డుకున్న ఘటనలో నిందితుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పలువురు కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
హైదరాబాద్: సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్లలో ఇసుక లారీలను అడ్డుకున్న ఘటనలో నిందితుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పలువురు కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. నిందితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని వారు పేర్కొన్నారు.
అంతేకాకుండా, థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగా బయటికి చెబితే ఇళ్లల్లోని ఆడవాళ్లపై బ్రోతల్ కేసులు పెడతామంటూ కూడా పోలీసులు నిందితులను బెదిరించారని, ఇదెక్కడి న్యాయమని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
బయటికి చెబితే ఆడవాళ్లపై.. : మల్లు భట్టి విక్రమార్క
నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క గురువారం మీడియాతో మాట్లాడారు. పోలీసుల మాటలు, చర్యలు అమానుషంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్టు బయటకు చెబితే ఆడవాళ్లను బ్రోతల్ కేసుల్లో ఇరికిస్తామని పోలీసులు బెదిరించారని చెప్పుకొచ్చారు.
హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం...
ఈ ఘటనపై త్వరలోనే జాతీయ మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అవసరమైతే బాధితుల తరపున పార్లమెంట్లో గళం విప్పుతామని స్పష్టం చేశారు. నేరెళ్ల ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భట్టి డిమాండ్ చేశారు.
మానవత్వానికే మచ్చ: జానారెడ్డి
నేరేళ్ల ఘటనలో పోలీసుల తీరు మానవత్వానికే మచ్చతెచ్చేలా ఉందని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. దీనిపై ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఆందోళన చేపడతామన్నారు. బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని జానా స్పష్టం చేశారు.
ఆ నాలుగు రోజులు ఎక్కడుంచారు?: షబ్బీర్ అలీ
కాంగ్రెస్ నేత షబ్బీర్ మాట్లాడుతూ.. నేరెళ్ల ఘటనలో నిందితులను నాలుగో తేదీన అరెస్ట్ చేసిన పోలీసులు 4 రోజులపాటు కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని సూటిగా ప్రశ్నించారు. దిగ్విజయ్ సింగ్ ట్వీట్లపై ప్రశ్నించగా.. నయీం కేసులాగే డ్రగ్స్ కేసును కూడా పాలక ప్రభుత్వం నీరుగారుస్తుందనే అనుమానంతో దిగ్విజయ్ ఆ రకంగా ట్వీట్ చేశారంటూ షబ్బీర్ అలీ క్లారిటీ ఇచ్చారు.