తెలంగాణలో పోలీస్ వాహనం చోరీ: ఏపీలో దొరికాడు
సూర్యాపేట: ఏకంగా పోలీసు వాహనాన్నే అపహరించిన ఓ దుండగుడు పోలీసులకే చెమటలు పట్టేలా చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ ప్రకాశ్ జాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట గ్రామీణ సీఐ ప్రవీణ్కుమార్ శనివారం సాయంత్రం పట్టణంలోని జిమ్కు వెళ్లారు.
ఓ గుర్తు తెలియని ద్విచక్రవాహనంతో పోలీసు వాహనం సమీపంలో ఆగాడు. ఆ తర్వాత వాహనంలో కూర్చున్న డ్రైవర్ సైదులుకు సీఐ పిలుస్తున్నారంటూ అతని దృష్టి మరల్చి వాహనాన్ని తీసుకొని పరారయ్యాడు. గమనించిన వెంటనే డ్రైవర్.. దుండగుడి ద్విచక్రవాహనంతో వెంబడించాడు. అయితే, ఆ దుండగుడు అతివేగంతో సద్దుల చెరువు కట్ట మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకొని కోదాడ వైపు దూసుకెళ్లాడు.
విషయం తెలుసుకున్న జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వాహనం చోరీకి గురైన సుమారు 4గంటల తర్వాత పోలీసులు సీసీ కెమేరాల సాయంతో నిందితుడిని గుర్తించారు. ఇతను సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తిరుపతి లింగరాజుగా నిర్ధారించారు.
వాహనం మునగాల, కోదాడ మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించినట్లు తెలుసుకున్నారు. నిందితుని భార్య అఖిల స్వగ్రామమైన ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురానికి లింగరాజు వెళ్లాడు. అక్కడే మరో నలుగురిని ఎక్కించుకుని ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తుండగా.. కృష్ణా జిల్లా చిల్లకల్లు చెక్పోస్టు వద్ద పోలీసులు నిందితుడ్ని, వాహనాన్ని పట్టుకున్నారు. కాగా, తనభర్త మానసికస్థితి బాగోలేదని అతని భార్య తెలిపిందని పోలీసులు తెలిపారు.