తెలంగాణలో మహాకూటమి ప్రభావం చూపిస్తుందా..? పారిపోతుందా..?
హైదరాబాద్: 2009లో అప్పటి ఉమ్మడిరాష్ట్ర సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డిని ఓడించేందుకు అన్నీ పార్టీల పెద్దలు చేతులు కలిపారు. అనుకూల మీడియా కూడా ఇదో అద్భుతమైన ఘట్టమంటూ అభివర్ణించింది. వైయస్ ప్రభావంతో పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ పని అయిపోయినట్టే అంటూ పెద్దయెత్తున ప్రచారం మొదలైంది. ఇదంతా నిజమే అనుకున్న కూటమి పార్టీలు, వైఎస్ చేపట్టిన ప్రతి అభివృద్ధి పనిలోనూ లొసుగులు వెతికాయి. విమర్శలు తారా స్థాయిలో గుప్పించారు. మహా కూటమి గెలుస్తుందని పదవుల పందేరానికి శ్రీకారం కూడా చుట్టుకున్నారు. కానీ అంతిమంగా మహాకూటమిని ఖంగుతినిపిస్తూ కాంగ్రెస్ నెగ్గింది. వైఎస్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అది చరిత్ర. కాని ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారాయి. ఇప్పుడేర్పడుతున్న మహాకూటమి తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం..!!
తెలంగాణలో మహాకూటమి.. నేతలు శ్రమిస్తారా.. నిష్క్రమిస్తారా అన్నదే సందేహం..!!
మళ్లీ పదేళ్లకు అదే మహాకూటమి.. అయితే ఇప్పుడు హస్తం స్థానంలో టీఆర్ ఎస్, వైఎస్ ప్లేసులో కేసీఆర్ ఉన్నారు. కాంగ్రెస్ అటువెళ్లి టీడీపీతో జతకట్టబోతుంది. కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేస్తున్న కోదండరాం నేనూ మీతోనే అంటూ అడుగులో అడుగు వేయబోతున్నారు. అయితే, చిక్కంతా ఒక్కటే. ఎవరి మాట ఎవరు వినాలి. ఏ పార్టీ కూటమి బాధ్యతను భుజాన వేసుకుంటుంది. కాంగ్రెస్ జాతీయపార్టీ కావటంతో ఉత్తమ్కు ఆ బాధ్యత అప్పగించారు. ఆయన కూడా అదిష్ఠానం ఏదంటే అదేనంటూ తలూపాల్సిందే. లేదంటే రేపటికి ఉత్తమ్ సీట్లో ఏ కోమటిరెడ్డో, మరో జానారెడ్డి, లేకపోతే గీతారెడ్డో చేరిపోతారు. ఎందుకీ తంటా అని రాహుల్ గాంధీ పైన భారం మోపి వదిలేశారు ఉత్తమ్.
అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు సత్తా చూపుతామంటున్న కూటమి నేతలు..!!
మరి టీడీపీ, తనకోసం కాంగ్రెస్ వచ్చిందంటే మేమే బలవంతులం, కాబట్టి సీట్ల పంపిణీ మా సైకిల్కే అంటూ మరో వాదన వినిపిస్తోంది. కేసీఆర్ అంటే ఎంత వైరమో, చంద్రబాబు అంటే అంతే గిట్టనట్టు ఉండే కోదండరాం మాత్రం ఎవరి మాట వింటారనే అంశం పై సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఎవరికైనా కేవలం 25 సీట్లు ఇస్తాం ఉంటే ఉండొచ్చు లేకపోతే మీ ఇష్టం అనే అజమాయించే స్థాయికి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు. ఈ సమయంలోనే టీఆర్ఎస్ తమకు బలమైన శత్రువని భావించిన వారి పాత కేసుల జాబితాను తిరగేస్తుంది. ఇప్పుటికే నలుగురు ఊచలు లెక్కపెట్టేందుకు రెడీ అయ్యారు. ఒకరు జగ్గారెడ్డి రూపంలో ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అందుకే పొత్తులపై ఆచితూచి స్పందిస్తున్నారేమోననే భావన కలుగుతోంది.
కూటమిని లీడ్ చేసేదెవరు..! అనే దానిపైనే ఉత్కంఠ..!!
అటు విమలక్కతో పాటు ఇటు గద్దరన్న మరో వైపు కోదండరాంను కలుపుకుని కూటమిని కొలిక్కితేవటం అనుకున్నంత తేలిక కాదని, టీడీపీ, కాంగ్రెస్లకు అర్ధమైనట్టుంది. టీడీపీ మాత్రం తమకు 35 సీట్లను డిమాండ్ చేస్తున్నట్టుఎ తెలుస్తోంది. రేపటి రోజున టీడిపి ఎంపీ సీట్లు ఎన్నికావాలంటుందో అనేది కాంగ్రెస్ ఆందోళన. సీట్ల సర్దుబాటు ముందుకు జరిగిన తరువాతనే కూటమి సంగతి అంటూ కూటమి కోసం వెంపర్లాడుతున్న పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పుడే ఇలా ఉంటే, ఎన్నికల్లో ఒకరితరపున మరొకరు ప్రచారం చేస్తారా అనేది మరో సందేహంగా మారింది. నేతలు ప్రచారం చేసినా, దశాబ్దాల తరబడి ఒక పార్టీకి ఓటేస్తున్న సంప్రదాయ ఓటర్లు మనసు మార్చుకుంటారా అనేది మరో విశేషం. ఇప్పుడు కూటమితో జట్టుకడితే ఎవరికి లాభం అనేది మాత్రం అన్ని పార్టీల్లోనూ చర్చనీయాంశంగా మారిందట.
అప్పుడు పెద్ద రాష్ట్రం.. ఇప్పుడు చిన్నది.. మహాకూటమికే అవకాశాలంటున్న విశ్లేషకులు..!
2009లో ఇలాగే అనుకుని వైఎస్ను తక్కువ అంచనా వేస్తే జరిగిన పరాభవం గుర్తుకు వస్తుందనే చర్చ జరుగుతోంది. అప్పుడంటే ఒకే రాష్ట్రం కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలు. ఒకవేళ మహాకూటమి విపలం చెందితే హస్తం పార్టీకి జాతీయ స్థాయిలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. టీడీపీ కూడా ఏపీలో దీనికి సంబందించిన అవమాన భారాన్ని మూటకట్టుకోవాల్సిందే..! అటు జాతీయంగా ఇటు రాష్ట్రంలోనూ ఎదురయ్యే ఇబ్బందులు బీజేపీ క్యాష్ చేసుకుంటుంది. ఒకవేళ కూటమి సక్సెస్ అయితే కాంగ్రెస్కు జాతీయస్థాయి ఖ్యాతితో పాటు, టీడీపీ ఏపీలో గెలుపు వందకు వంద శాతం నిర్ధారణ జరిగిపోతుంది. ఇవే పరిణామాలు కేంద్రంలో చక్రం తిప్పేందుకు బలాన్ని ప్రోదిచేస్తాయన్న వాస్తవాన్ని మహాకూటమి నేతలు గ్రహిస్తే లక్ష్య సాధన పెద్ద కష్టతరం కాకపోవచ్చు.