తెలంగాణాలో ఉద్యోగాల కల్పనపై పొలిటికల్ హీట్ .. కేటీఆర్ సవాల్ కు బీజేపీ, కాంగ్రెస్ ప్రతి సవాల్
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో అన్ని పార్టీల ఫోకస్ యువతపైనే ఉంది. దీంతో ఉద్యోగాల కల్పనపై రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఉద్యోగాల భర్తీపై టిఆర్ఎస్, కాంగ్రెస్ , బీజేపీ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి.
Recommended Video
లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేటీఆర్ ప్రకటన
టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేటీఆర్ ప్రకటించారు. ఇది తప్పని నిరూపిస్తే చర్చకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు . తమ పాలనలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని కేటీఆర్ లెక్కలు చెప్పారు . గతంతో పోలిస్తే ఉద్యోగావకాశాలు ఎక్కువగానే కల్పించామని చెప్పారు. కేటీఆర్ సవాల్ ను స్వీకరించిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆయనకు ప్రతి సవాల్ విసిరారు.
ఉస్మానియా యూనివర్సిటీలో చర్చకు రావాలన్న బీజేపీ
బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు లక్ష ఉద్యోగాల కల్పన అంశంపై కేటీఆర్ చర్చకు సిద్ధమని ప్రకటించారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీకి వెళదామని, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ కి కేటీఆర్ రావాలని బిజెపి సవాల్ విసిరింది. ఓయూకు వస్తే ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది లెక్కలు తేలుతాయని బీజేపీ నేతలు కేటీఆర్ కు సవాల్ విసురుతున్నారు. ఇదిలా ఉంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై, తమ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో కేటీఆర్ విడుదల చేసిన బహిరంగ లేఖపై కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం మండిపడుతున్నారు.
గన్ పార్క్ వద్ద చర్చకు రావాలన్న కాంగ్రెస్
కాంగ్రెస్ హయాం కంటే తమ హయాంలోనే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు టిఆర్ఎస్ లక్ష ఉద్యోగాలపై చర్చకు రావాలని ప్రతి సవాల్ చేశారు. కేటీఆర్ లెక్కలు తప్పని లక్ష ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు గన్ పార్క్ వద్ద నిరుద్యోగులతో కలిసి బైఠాయించిన దాసోజు శ్రవణ్ ఉద్యోగాలు చర్చపై టిఆర్ఎస్ పార్టీ నేతలకు చర్చలో పాల్గొన్న ఆలోచన లేనట్లుగా ఉందని విమర్శించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో యువతపై అన్ని పార్టీల ఫోకస్
తప్పుడు లెక్కలు చెప్పి నిరుద్యోగులను మభ్య పెట్టాలని చూస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు
. మొత్తానికి కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీ హయాంలో యువతకు లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని చేసిన ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు కేటీఆర్ కు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుతూ నిరుద్యోగ యువతను ఉద్యోగాలపై ఫోకస్ చేసేలా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో యువత ఉద్యోగాల విషయంలో కొనసాగుతున్న రచ్చ ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.