డిపెండెంట్లే కీలకం: కోల్బెల్ట్పై కార్మిక నేతల నజర్
సింగరేణి తెలంగాణకే మకుటాయమానం. ఆరు జిల్లాల పరిధిలోని 11 ప్రాంతాల్లో విస్తరించిన ఉన్న కోల్ బెల్ట్ పరిధిలో జరిగే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వచ్చే నెల ఐదో తేదీన జరుగనున్నాయి.
హైదరాబాద్: సింగరేణి తెలంగాణకే మకుటాయమానం. ఆరు జిల్లాల పరిధిలోని 11 ప్రాంతాల్లో విస్తరించిన ఉన్న కోల్ బెల్ట్ పరిధిలో జరిగే సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వచ్చే నెల ఐదో తేదీన జరుగనున్నాయి. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ ఎన్నికలు భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయనుండటంతో ప్రధాన పార్టీలు.. వాటి అనుబంధ కార్మిక సంఘాల నాయకులు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన కార్యాచరణపై ద్రుష్టిని కేంద్రీకరించాయి.
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో కీలకం కావడంతో అనుబంధ సంఘాల తరఫున ప్రచారానికి పార్టీల నేతలు సిద్ధమయ్యారు. ఇప్పటికే భాగ్యనగరి కేంద్రంగా చర్చలు, వ్యూహాల రూపకల్పనలో భాగస్వాములవుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ప్రధాన పార్టీల నాయక గణం కోల్బెల్ట్ను చుట్టేయనున్నది.
ఇదిలా ఉంటే సింగరేణిలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న వారసులకు ఉద్యోగాల కల్పన అంశం.. కార్మికులు, వారి కుటుంబాలను ఊరిస్తూనే ఉన్నది. వారికి ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో పరిస్థితి తారుమారైంది. ఇతర వసతుల కల్పనపైనా ద్రుష్టి సారించాయి కార్మిక సంఘాలు. ఆ అంశాలపై మేనిఫెస్టోలు జారీ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.
కార్మిక సంఘాలకు ప్రతిష్ఠాత్మకం ఇలా
సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీలు విజయమే లక్ష్యంగా భావించడంతో సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఆరు జిల్లాల పరిధిలో 16 శాసనసభ, ఐదు లోక్ సభ స్థానాల పరిధిలో విస్తరించి ఉన్న కోల్ బెల్టు పరిధిలో మరో 18 నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించనున్నాయి. ముఖ్యంగా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ అనుబంధ సంఘాలు.. అధికార టీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ను ఎలాగైనా ఓడించాలని లక్ష్యంగా.. పట్టుదలగా ఉన్నాయి. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ, సీపీఐ అనుబంధ యూనియన్ ఏఐటీయూసీ పొత్తు పెట్టుకునే సంకేతాలు వచ్చాయి. రెండు సంఘాల నాయకుల మధ్య ఇప్పటికే రెండు, మూడు దఫాలు చర్చలు జరిగాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఎంపీ కవిత ఇలా చర్చలు
మరోవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా టీబీజీకేఎస్ విజయంపై ద్రుష్టిని కేంద్రీకరించింది. సంఘం గౌరవాధ్యక్షురాలు, పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఇప్పటికే కోల్ బెల్ట్ పరిధిలోని ప్రజా ప్రతినిధులతో సమావేశమై ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. టీఆర్ఎస్ తరఫున రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, కే తారక రామారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ నల్లాల ఓదెలు, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారు జీ వివేకానంద తదితరులు ప్రచార బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇలా
బీజేపీ అనుబంధ సంఘం బీఎంఎస్కు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడంతోపాటు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సేవలను వినియోగించుకోవాలని తలపోస్తున్నది. ఈ మేరకు సంప్రదింపులు పూర్తయితే ఆయన ప్రచారంలో పాల్గనే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, శాసనసభా పక్ష నేత కిషన్ రెడ్డిలను కూడా ప్రచారంలోకి తేనున్నారు.
టీడీపీ తరఫున రేవంత్.. సీఐటీయూకు తమ్మినేని
ఐఎన్టీయూసీ తరఫున టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ప్రచారం చేయనున్నారు. టీడీపీ తరఫున పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీఐటీయూ తరఫున సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తదితరులు ప్రచారబరిలో దిగనున్నారని తెలుస్తున్నది.
ఇతర వసతులు, రాయితీలపై ఇలా నజర్
ఆయుధంగా నిలుస్తున్న వారసత్వ ఉద్యోగాల అవకాశం అన్ని సంఘాల మేనిఫెస్టోల్లో చోటుచేసుకోనున్నది. కార్మికులు ఉద్యోగ విరమణ చేసేలోగా వారికి ఒక ఇల్లు నిర్మించుకునే అవకాశాన్ని కల్పించే అంశం కూడా ప్రధానంగా నిలవనుంది. సింగరేణి కార్మికులకు ఆదాయంపన్నులో రాయితీని కూడా యాజమాన్యం చెల్లించేలా చర్యలు తీసుకొంటామని కూడా పలు సంఘాలు హామీలు ఇవ్వనున్నాయి. ఈ అంశం కూడా కార్మికుల ఓట్లను భారీగా రాల్చే అవకాశం ఉన్నందున తమ అమ్ముల పొదిలో చేర్చుకొన్నాయి.
మెరుగైన పని ప్రాంతాలు, దుస్తులు, బూట్లు ఏర్పాటు చేయడం, పిల్లలు చదువుకొనేందుకు కేంద్రీయ పాఠశాలల ఏర్పాటు, వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి తదితర అంశాలను కూడా సంఘాలు తమ ప్రణాళికలో పొందుపర్చుకున్నాయి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎన్నికల మేనిఫెస్టోను కొద్దిరోజుల కిందట తయారు చేసి తమ సంఘం గౌరవాధ్యక్షురాలు కవిత ముందుంచింది. ఇందులోని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన గౌరవాధ్యక్షురాలు దీన్ని ఆమోదించగానే ప్రణాళిక విడుదలకు సిద్ధపడుతోంది. వచ్చేవారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మేనిఫెస్టో విడుదల కావచ్చని తెలుస్తోంది.
బీజేపీ సాయంపై కేంద్రం దన్నుతో ఇలా బీఎంఎస్
ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ 40 హామీలతో బరిలోకి దిగనుంది. ఒకటి, రెండు రోజుల్లో కార్యవర్గం కూర్చొని ఈ మేనిఫెస్టోలోని అంశాలను ధ్రువీకరించాల్సి ఉంది. పదో వేతన ఒప్పందం కోసం సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మేనిఫెస్టో ఖరారులో జాప్యం ఏర్పడుతోంది. సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ 30 అంశాలతో ఒక ప్రణాళికను రూపొందించింది. జాతీయ కార్మిక సంఘంగా తాము చేయబోయే కృషిని గురించి,
కార్మికులకు సాధించిపెట్టే అంశాలను ఈ సంఘం తమ ఎన్నికల ప్రణాళికగా రూపొందించింది. వచ్చే వారం తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే పనిలో ఆ సంఘం నాయకులు నిమగ్నమై ఉన్నారు. 15 ప్రధాన వాగ్దానాలతో బీఎంఎస్ మేనిఫెస్టో రూపొందింది. ముఖ్యంగా కోలిండియాలో అమలవుతున్న అనేక సౌకర్యాలు సింగరేణిలో అమలుకాని అంశాలకు ఈ సంఘం ప్రాధాన్యం ఇచ్చింది. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుంచి కావాల్సిన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బీఎంఎస్ ప్రకటించనుంది. హెచ్ఎంఎస్ సంఘం సైతం కొన్ని ప్రధాన డిమాండ్లను ఇప్పటికే ప్రకటించి ఎన్నికల ప్రచారానికి, గోడపత్రాలతో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. త్వరలో ఎన్నికల ప్రణాళికను బహిరంగంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది.