తెలంగాణలో ముందస్తు ఎన్నికల వ్యూహం : ఈ నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్ధుల ఖరారు : రేవంత్ ప్లాన్ కు ధీటుగా..!!
బీజేపీ నాయకులు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే సమాయత్తం అవుతున్నారు. ముందస్తుగానే అసెంబ్లీ ఎన్నికలు ఖాయమని అంచనా వేస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు అప్పుడే అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధుల జాబితా ఖరారు చేస్తున్నారు. దీని ద్వారా చివరి నిమిషం వరకు పోటీ నివారించటంతో పాటుగా.. అభ్యర్ధులు ముందుగానే ప్రజలతో మమేకం అవ్వటానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. చార్మినార్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రం అక్టోబర్ రెండున హుజూరాబాద్ లో ముగియనుంది.
పాదయాత్ర ద్వారానే ఎన్నికలకు సిద్దం
ఈ యాత్ర మొత్తంగా 22 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో సాగింది. బండి సంజయ్ తన పాదయాత్ర సమయంలోనే పర్యటించిన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి..నేతల పనితీరు.. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ వర్గానికి చెందిన వారికి సీటు ఇవ్వాలనే అంశాల పైన ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా వచ్చే ఎన్నికల వరకు మరో నాలుగు విడతల్లో పాదయాత్ర కొనసాగనున్నందున, ఇకముందు యాత్ర సాగే రూట్లలో పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తం అయ్యేందుకు ముందస్తు అభ్యర్థుల ప్రకటన దోహదపడుతుందని భావిస్తున్నారు.
ముందస్తు ఎన్నికలు ఖాయమనే భావనలో
వచ్చేనెల 2న హుజూరాబాద్లో పాదయాత్ర ముగింపు సందర్భంగా రోడ్ షో నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. తొలుత ఇక్కడ బహిరంగ సభ నిర్వహించి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని భావించారు. మరో ముఖ్యమైన సందర్భంలో నడ్డా రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించాలని.. ఇక, పాదయాత్ర ముగింపు సభా కార్యక్రమంలో మార్పు చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో 2న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. బీజేపీ ముఖ్య నేతల నుంచి అందుతున్న సమచారం మేరకు కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఇప్పటికే ఖరారు చేసారు.
బీజేపీ ఖరారు చేసిన అభ్యర్ధులు
అందులో చార్మినార్, నాంపల్లి, కార్వాన్ (అమర్సింగ్), గోషామహల్ (రాజాసింగ్ సిట్టింగ్ స్థానం), వికారాబాద్ (మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్), ఆందోల్ (మాజీమంత్రి బాబూమోహన్), నరసాపూర్, దుబ్బాక (సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్రావు), ఎల్లారెడ్డి (మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి), హుజూరాబాద్ (మాజీ మంత్రి ఈటల రాజేందర్) ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే, సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ చాలా రోజులుగా చెబుతున్నారు.
రేవంత్ సైతం ముందస్తు వ్యూహాలతోనే
ఇప్పటికే రేవంత్ తెలంగాణ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి..నేతలకు ఉన్న పట్టు పైన ఆరా తీస్తున్నట్లు సమాచారం. త్వరలో నియోజవకర్గాల పైన సర్వే కు సైతం సిద్దం అయినట్లు చెబుతున్నారు. అధికార టీఆర్ఎస్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే ల్లోనే కొంత మంది మినహా మిగిలిన వారికి సీట్లు ఖరారయ్యే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ -బీజేపీ అంచనా వేస్తున్నాయి. దీంతో..కాంగ్రెస్ అభ్యర్దులను సైతం ముందుగానే ఖరారు చేయటం ద్వారా ఎన్నికల వేళ సహజంగా కాంగ్రెస్ లో కనిపించే వాతావరణానికి ఈ సారి అవకాశం లేకుండా చేయాలనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది.
కేసీఆర్ - బీజేపీ వ్యూహాలకు ధీటుగా రేవంత్ ఆలోచనలు
అందులో భాగంగా ఇప్పటికే ప్రాధమికంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కసరత్తులో భాగమే 86 సీట్లలో కాంగ్రెస్ గెలుపు ఖాయమనే నినాదం ఇప్పటికే టీపీసీసీ మొదలు పెట్టింది. దీంతో..టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో సహజంగా కలిసొచ్చే అంశాలు...ప్రధాన పోటీగా భావిస్తున్న కాంగ్రెస్ ఆలోచనలకు కౌంటర్ గానే తమ పార్టీ సైతం అభ్యర్దుల ఎంపిక పైన ముందుగానే కసరత్తు మొదలు పెట్టినట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో...తెలంగాణలో అప్పుడే ముందస్తుగా ఎన్నికల సందడి మొదలు అయినట్లు కనిపిస్తోంది.
Recommended Video
కేసీఆర్ ఆలోచనల పైన టీఆర్ఎస్ నేతల అంచనా
అభ్యర్ధులను ఇంత ముందుగా ఖరారు చేయటం వలన కొన్ని నష్టాలు ఉన్నాయనే అభిప్రాయం పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఖచ్చింగా ఎవరైతే పోటీకి దిగుతారో వారి పేర్లను మాత్రమే ముందుగా ప్రకటిస్తారని నేతలు చెబుతున్నారు. దీని ద్వారా ముందుగానే నేతలు సీట్ల కోసం పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో తమ నియోకవర్గాల్లో సీట్లు రాని వారు ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉంది. అయితే, కేసీఆర్ అసలు ముందస్తుకు వెళ్లటం ఖాయమని టీఆర్ఎస్ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు.