వరంగల్లో మాకు పోటీయే లేదు: తుమ్మల, ప్రజలే తేల్చుతారు: దేవయ్య
మహబూబ్ నగర్/వరంగల్: వరంగల్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి పోటీనే లేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గురువారం అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రులు తుమ్మల, జూపల్లి కృష్ణారావులు పర్యటించారు.
వరంగల్లో పుట్ట మధు ప్రచారం
వరంగల్ లోకసభ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించి ఓరుగల్లు ఓటర్లు విపక్షాలకు తగిన బుద్ది చెప్పాలని ఎమ్మెల్యే పుట్ట మధు కోరారు. వరంగల్ భూపాలపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పుట్ట మధు మాట్లాడారు.
టీఆర్ఎస్ను గెలిపించి విపక్షాలకు బుద్ది చెప్పాలన్నారు. దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, 25 కొత్త పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకు వచ్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మేమంతా పని చేస్తున్నామన్నారు.
దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచేందుకు సీఎం కెసిఆర్ కృషి చేస్తున్నార్నారు. మేనిఫెస్టోలో లేని హామీలను సైతం తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రజల చెంతకు చేరేందుకే ప్రచార వారధులు అని టిఆర్ఎస్ వరంగల్ జిల్లా ఇంచార్జ్ పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ప్రజలే తేలుస్తారు: దేవయ్య
రైతుల ఆత్మహత్యలు ఆపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బిజెపి - టిడిపి వరంగల్ ఉప ఎన్నిక అభ్యర్థి దేవయ్య అన్నారు. తాను స్థానికుడిని కాదన్న టిఆర్ఎస్ ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఎవరు స్థానికుడో ప్రజలే తేల్చుతారని చెప్పారు.