ఏపీ తెలంగాణాల మధ్య ముదురుతున్న పొలిటికల్ వార్... దేనికోసం ?
Recommended Video
ఏపీ, తెలంగాణ మధ్య డేటా వార్ పొలిటికల్ వార్ గా మారుతోందా? ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు ఈ వ్యవహారంలో ఇంతగా ఇన్వాల్వ్ అవుతున్నాయి? రానున్న ఎన్నికల నేపథ్యంలోనే ఈ డేటా వార్ ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకుందా? అన్నది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
ఐటీ గ్రిడ్ వివాదం ... రాజకీయం కోసమా ?
ఏపీ ప్రజల డేటాను దుర్వినియోగం చేస్తున్నారన్న అంశం ఐటీ గ్రిడ్ వివాదంలో వెలుగులోకి వచ్చింది. ఏపీ లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రజల డేటా చౌర్యానికి పాల్పడింది అని తెలంగాణా ప్రభుత్వం ఆరోపిస్తుంది.తెలంగాణ, ఏపీ మధ్య డేటా వార్ ముదురుతోంది. చంద్రబాబు, కేటీఆర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ డేటాపై తెలంగాణ పెత్తనమేంటని చంద్ర బాబు ప్రశ్నిస్తుంటే అసలు ఏపీ పోలీసులకు తెలంగాణలో పనేంటంటూ కేటీఆర్ కౌంటర్ ఇస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు. ఐటీ గ్రిడ్ కేసులో ఏపీ, తెలంగాణ మధ్య పీక్స్ లో పొలిటికల్ వార్ నడుస్తోంది.
చంద్రబాబును ఇరికించే యత్నంలో తెలంగాణా ప్రభుత్వం
ఏపీ ప్రజల డేటాను చోరీ చేసినట్లు గా చంద్రబాబు ప్రభుత్వం పై ఉచ్చు బిగించే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మొదటి నుంచి చంద్రబాబు అంటే బద్ధశత్రువుగా చూస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన తనయుడు కేటీఆర్ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును టార్గెట్ చేశారు. ఇదే అదునుగా ఐటీ గ్రిడ్ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి బాగా పనికొచ్చింది. ఒకపక్క ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి, మరోపక్క కేంద్రం నుండి ఎదురవుతున్న ఇబ్బందికర పరిణామాలు, ఇంకోపక్క ఐటీ గ్రిడ్ వ్యవహారంతో తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ఇబ్బంది వెరసి చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
చంద్రబాబు పై కేటీఆర్ తో పాటు ప్రతిపక్షాల దాడి
చంద్రబాబు, కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలుతుండగా, పనిలో పనిగా వైసీపీ లీడర్లు కూడా ఏపీ సీఎంపై విరుచుకుపడుతున్నారు.ఏపీ డేటాపై కేసులు పెట్టడానికి తెలంగాణ పోలీసులు ఎవరంటూ చంద్రబాబు ప్రశ్నించారు. తన జోలికి వస్తే వదిలేది లేదంటూ మోడీ, కేసీఆర్, జగన్కి వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ప్రజల డేటా చోరీ చేయకపోతే చంద్రబాబుకి భయమెందుకని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఓట్ల తొలగింపు కుట్రలో భాగంగానే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి చంద్రబాబు కట్టబెట్టారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఐటీ పరిజ్ఞానాన్ని బాబు కుట్రల కోసం వాడుకుంటున్నారన్న వైసీపీ నేత పార్ధసారధి చంద్రబాబుపై రాజద్రోహం కింద కేసు నమోదు చేయాలన్నారు.
రానున్న ఎన్నికలే లక్ష్యంగా ఐటీ గ్రిడ్ పేర పొలిటికల్ వార్
మొత్తానికి డేటా చౌర్యం కేసులో ఏపీ-తెలంగాణ మధ్య వార్ ముదురుతోంది. మరోవైపు తెలంగాణ పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకోవడంతో ముందుముందు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో అలాగే ఏపీ సర్కార్ ఎలా రియాక్టవుతుందో చూడాలి. ఏది ఏమైనా కలిసిమెలిసి ఉండాల్సిన రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇరు రాష్ట్రాల సీఎంల తీరుతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రస్తుత పరిణామాలన్నింటికీ రానున్న ఎన్నికలే కారణం కావడం గమనార్హం.