బాహుబలి: రాజకీయనేతలు ప్రశంసల జల్లు, రాత్రికి చూడనున్న కేసీఆర్
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ తారాగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన బాహుబలి సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంపై తెలంగాణ రాజకీయ నేతలు, ఉన్నాతాధికారులు ప్రశంసల జల్లు కురిపించారు.
శనివారం ఉదయం తెలంగాణ రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల కోసం ఐమ్యాక్స్ థియటేర్లో ఏర్పాటు చేసిన 'బాహుబలి' ప్రత్యేక ప్రదర్శనను తిలకించారు. చిత్రాన్ని చూసి బయటకు వచ్చిన తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి, శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్ 'బాహుబలి' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
'బాహుబలి' సినిమా ద్వారా రాజమౌళి భారతీయ చిత్రాలను హాలీవుడ్ రేంజికి తీసుకెళ్లారని నాయిని, స్వామి గౌడ్ పేర్కొన్నారు. చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమని వారు పేర్కొన్నారు. ఐమ్యాక్స్లో ఈ చిత్ర ప్రదర్శనకు రాజకీయ నేతలతో పాటు పెద్ద సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ తమ కుటుంబాలతో కలిసి హాజరయ్యారు.
ఈరోజు రాత్రికి బాహుబలి చూడనున్న కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ‘బాహుబలి' సినిమా చూడాలని డిసైడ్ అయ్యారు. నైజా డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఆయన కోసం జులై 11న రాత్రి ప్రత్యేక షో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ షోకు కేసీఆర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు ‘బాహుబలి' సినిమా గురవారం అర్థరాత్రి బెనిఫిట్ షోలతో ప్రారంభం అయింది. అభిమానులు సినిమా చూసి అద్భుతం అని అంటున్నారు. అయితే క్రిటిక్స్ నుండి మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది. అయితే సినిమా తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందని, గ్రాండ్ లుక్ ఉందని, హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉందని అందరూ ఒప్పుకున్నారు.