రోహిత్ ఆత్మహత్య బాధించింది, రాజకీయం మాని.. తల్లి శోకాన్ని అర్థం చేసుకోండి: మోడీ
లక్నో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన పైన రాజకీయాలు వదిలి, ఆ తల్లి శోకాన్ని అర్థం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం లక్నోలో బిఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు.
రోహిత్ మృతి పైన ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేముల రోహిత్ ఆత్మహత్య తనను కలచివేసిందని చెప్పారు. ఆ తల్లి శోకాన్ని మనం అర్థం చేసుకుందామన్నారు. రోహిత్ కుటుంబానికి ప్రధాని మోడీ తన సంతాపాన్ని తెలిపారు.
రోహిత్ ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైన పరిస్థితి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కాసేపు నివాళులు అర్పించారు. రోహిత్ మృతితో భారత దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందన్నారు. అందరు రాజకీయాలను పక్కన బెట్టి బిడ్డను కోల్పోయిన తల్లి శోకాన్ని అర్థం చేసుకోవాలన్నారు.
ప్రతి వ్యక్తి సమున్నత స్థానానికి చేరుకోవాలని బాబా సాహెబ్ అంబేడ్కర్ కోరిక అన్నారు. డాక్టర్ అంబేడ్కర్ తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేశారని చెప్పారు. విద్యపట్ల స్పష్టమైన దూరదృష్టి ఉన్న వ్యక్తి అంబేడ్కర్ అన్నారు.
విద్య ద్వారా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదన్నది తెలుస్తుందన్నారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేడ్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. మనం ఈ రోజు పొందుతున్న స్వేచ్ఛ, స్వాతంత్రం మన ముందు తరాల త్యాగఫలమని చెప్పారు. కల్పనను సాకారం చేసుకునే విధానం కఠినమైనదన్నారు.