పాలిటిక్స్ లో భయపెట్టడమే కాదు..భయపడే సందర్బాలూ ఉంటాయి..! తొలిసారి భయపడ్డ కేసీఆర్..!!
హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు అనడానికి తెలంగాణ లో జరుగుతున్న ఉదంతాలే కారణంగా చెప్పుకోవచ్చు. భయం అంటే ఏమిటో తెలియని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు తొలిసారి భయపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మకుటంలేని మహారాజుగా కొనసాగుతున్న చంద్రశేఖర్ రావును భారతీయ జనతా పార్టీ భయపెడుతున్నట్టు తెలుస్తోంది. దీంతో తెలంగాణలో రాజకీయం వేగంగా మారుతోంది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లి తిరుగులేని మెజారిటీతో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ రావు ఆర్నెళ్లలో బలహీనపడ్డట్టు లోక్ సభ ఎన్నికలు రుజువుచేసాయి. ఎమ్మెల్యేల సంఖ్యా పరంగా ఆయన ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదు. అయినప్పటికీ, బీజేపీకి తెలంగాణలో నలుగురు ఎంపీలు ఉండడంతో టీఆరెస్ అధినేతకు నిద్రపట్టడం లేదు. ప్రతిపక్షం లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను, నాయకులను చంద్రశేఖర్ రావు లాగేసుకున్నారు. కానీ బీజేపి రూపంలో వస్తున్న ముప్పును నివారించాలని చంద్రశేఖర్ రావు ముందస్తు ప్రణాళికలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు..! అప్రమత్తమైన కేసీఆర్..!!
కానీ మొన్నటి లోక్ సభ ఎన్నికల తరువాత సీను మారింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం.. తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడం, కిషన్ రెడ్డికి కీలకమైన హోంశాఖ సహాయమంత్రి పదవి వరించడంతో చంద్రశేఖర్ రావు లో దిగులు మొదలైంది. మంత్రి హోదాలో తొలి రోజు నుంచే కిషన్ రెడ్డి దూకుడు పెంచారు. అమిత్ షా కూడా తెలంగాణపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీలోకి నాయకుల వలసలు మొదలయ్యాయి. ఇలాంటి తరుణంలో, తెలంగాణవ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడమనేది టీఆర్ఎస్ కు సవాల్ గా మారింది.
కేసీఆర్ లో తొలిసారి ఆందోళన.. చాపకింద నీరులా బీజేపి..
ఆ క్రమంలో బీజేపీ ఎంపీలున్న జిల్లాల్లో కొందరు బలమైన నేతలకు మంత్రి పదవులు ఇచ్చే ఎలా ఉంటుందోనని చంద్రశేఖర్ రావు యోచిస్తున్నారు. నిజానికి చంద్రశేఖర్ రావు రెండోసారి సీఎం అయ్యాక చాలాకాలం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దాంతో సీనియర్ నేతల్లో, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి పెల్లుబికింది. కానీ, ఎవరూ బయటపడలేదు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు అలా ఉండకపోవచ్చు. అందుకే, చంద్రశేఖర్ రావు తన మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారట. అందులోభాగంగా. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్నారట. ప్రత్యేకంగా ఆయనపై చంద్రశేఖర్ రావు దృష్టి పడడానికి బలమైన కారణముంది.
కరీంనగర్ లో వాడిన గులాబీ..! బలోపేతం చేసేదిశగా కేసీఆర్ వ్యూహాలు..!!
కరీంనగర్ నుంచి వరుసగా మూడుసార్లు కమలాకర్ గెలిచారు. అక్కడ ఇంతవరకు వరుసగా మూడుసార్లు గెలిచినవారెవరూ లేరు. అందుకే, తనకు మంత్రి పదవి వస్తుందని కమలాకర్ గతంలోనే అనుకున్నారు. కానీ చంద్రశేఖర్ రావు మాత్రం ఆయనకు బదులుగా, సీనియరైన ఈటెలకు పదవి ఇచ్చారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బీజేపీ నేత బండి సంజయ్ గెలిచారు. కమలాకర్. సంజయ్, ఇద్దరిదీ దూకుడు స్వభావమే. ఇద్దరూ సమ ఉజ్జీలే. వీరికి అన్ని వర్గాల్లో మంచి పట్టుంది. అక్కడ ఏమాత్రం ఉపేక్షించినా టీఆర్ఎస్ క్యాడర్ ను బీజేపీలోకి సంజయ్ లాక్కునే ప్రమాదముంది.
ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయం..! వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న కేసీఆర్..!!
దీనికి అడ్డుకట్ట వేయాలంటే కమలాకర్ కు మంత్రి పదవి ఇవ్వాలి. సంజయ్ కన్నా కూడా ఓ మెట్టు పైనే ఉంచాలి. ఇదంతా జరగాలంటే, కమలాకర్ కు మంత్రి పదవి కట్టబెట్టాల్సిందే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కమలాకర్ చేతిలో బండి సంజయ్ ఓడిపోయారు. కానీ, అక్కడి నాలుగు నెలల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. పైగా, ఇప్పుడు మరో తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనకు సంజయ్ అత్యంత సన్నిహితుడు. ఇలా, అక్కడ సంజయ్ మెల మెల్లగా పట్టు బిగిస్తున్నారు. సంజయ్ ప్రాబల్యం నుంచి పార్టీని కాపాడుకునేందుకుగాను కమలాకర్ కు మంత్రి పదవి ఇవ్వడానికి చంద్రశేఖర్ రావు వ్యూహం రచిస్తున్నట్టు తెలుస్తోంది.