సింగరేణి లో గులాబీ జెండా రెపరెపలు, 9 చోట్ల టీబీజీకేఎస్ గెలుపు, సంబరాల్లో టీఆర్ఎస్ శ్రేణులు
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ దూసుకెళుతోంది. ఇప్పటికే ఇల్లందు, సింగరేణి భవన్, కొత్తగూడెం కార్పొరేట్, బెల్లంపల్లిలో టీబీజీకేఎస్ జయకేతనం ఎగురవేసింది.
హైదరాబాద్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 11 డివిజన్లలో 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకోగా, ప్రత్యర్థి సంఘం ఏఐటీయూసీ కేవలం 2 డివిజన్లలో మాత్రమే గెలుపొందింది.
ఇల్లందు, సింగరేణి భవన్, కొత్తగూడెం కార్పొరేట్, బెల్లంపల్లి, మణుగూరు, శ్రీరాంపూర్, రామగుండం-1, 2, 3 ఏరియాల్లో టీబీజీకేఎస్ విజయం సాధించడంతో టిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. భూపాలపల్లి, మందమర్రి ఏరియాల్లో ఏఐటీయూసీ గెలిచింది.
హైదరాబాద్ కార్పొరేట్లో కూడా టీబీజీకేఎస్ గెలుపొందింది. ఇక్కడ 77 ఓట్లతో టీబీజీకేఎస్ గెలుపొందగా ఏఐటీయూసీకి 4 ఓట్లు, సీఐటీయూ కి 2 ఓట్లు, బీఎంఎస్ కి 1 ఓటు వచ్చింది.
ఇల్లెందులో టీబీజీకేఎస్ గెలుపు బావుటాను ఎగురవేసింది. 217 ఓట్ల మెజార్టీతో టీబీజీకేఎస్ గెలిచింది. మొత్తం టీబీజీకేఎస్కు 617 ఓట్లు రాగా ఏఐటీయూసీకి 400, హెచ్ఎంఎస్ కు 36 ఓట్లు వచ్చాయి.
కొత్తగూడెం కార్పొరేట్లో 544 ఓట్ల ఆధిక్యంతో టీబీజీకేఎస్ గెలుపొందింది. ఇక్కడ మొత్తం ఓట్లు 1475కాగా 1415 ఓట్లు పోలైయ్యాయి. వీటిలో టీబీజీకేఎస్కు 866 ఓట్లు రాగా ఏఐటీయూసీకి 322 ఓట్లు వచ్చాయి.
ఇక బెల్లంపల్లిలోనూ 174 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ విజయం సాధించింది. మణుగూరులో కూడా 629 ఓట్ల మెజారిటీతో టీబీజీకేఎస్ గెలుపు సాధించింది.
భూపాలపల్లిలో 6,854 ఓట్లకుగాను 6,415 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 937 ఓట్ల మెజారిటీతో ఏఐటీయూసీ గెలుపు సాధించింది. అలాగే మందమర్రి ఏరియాను కూడా 800 ఓట్ల మెజారిటీతో ఏఐటీయూసీ కైవసం చేసుకుంది.
శ్రీరాంపూర్ లో 2,215 ఓట్ల మెజారిటీతో, అలాగే రామగుండం-1 లో , రామగుండం-2, రామగుండం-3 ప్రాంతాల్లో కూడా టీబీజీకేఎస్ గెలుపు సాధించింది.
కార్మికులకు రక్షకులుగా ఉంటాం: ఎంపీ సీతారాంనాయక్
సింగరేణి విజయాన్ని సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇస్తున్నందుకు కార్మికులకు రక్షకులుగా ఉంటామని టీఆర్ఎస్ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయం దిశగా దూసుకెళ్తుండటంపై ఆయన స్పందిస్తూ.. టీబీజీకేఎస్ను ఘన మెజార్టీతో గెలిపిస్తున్న బొగ్గు గని కార్మికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల ప్రచార సందర్భంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు.
పట్టంకట్టారు.. వాగ్ధానాలను నెరవేరుస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సింగరేణిలో టీబీజీకేఎస్ విజయం సాధించడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుత.. సింగరేణి ఎన్నికల ఫలితాలు సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు. ఓటేసిన సింగరేణి కార్మికులందరికీ ధన్యవాదాలని అన్నారు. కేసీఆర్ పాలనపై విశ్వాసంతోనే కార్మికులు టీబీజీకేఎస్కు పట్టంకట్టారని, ఇచ్చిన వాగ్ధానాలను నెరవేరుస్తామని మంత్రి హామీ ఇచ్చారు.