మెట్రో రైలుకు కాలుష్యం సెగ... నిలిచిపోతున్న సర్వీసులు
Recommended Video
హైదరాబాద్ మహానగరంలోని కాలుష్యం సెగ ఇప్పుడు మెట్రో రైలుకు తాకింది. ఉప్పల్, నాగోల్లో కాలుష్యం పెరిగిపోవడంతో ఆ దుమ్ము ధూళి లేదా కార్బన్ ఉద్గారాలు మెట్రో కేబుల్స్ను కప్పేయడంతో మెట్రో రైలు నడపడం ఇబ్బందిగా మారింది. దీంతో మెట్రో రైలు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ఇదిలా ఉంటే కాలుష్య కారణంగా ఆదివారం మెట్రో రైలు ఆదివారం ప్రకాష్ నగర్లో నిలిచిపోయింది.
డంపింగ్ యార్డు నుంచి కేబుల్స్ పై పేరుకుపోతున్న పదార్థాలు
ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కనే డంపింగ్ యార్డు ఉంది. ఇక అక్కడ చెత్త చెదారం డంప్ చేస్తుండటంతో అక్కడి నుంచి వివిధ రకాల విష వాయువులు విడుదల అవుతున్నాయి. అంతేకాదు ఉప్పల్ మెట్రో డిపోలోకి ఈ వాయువులు వెళుతున్నాయి. అక్కడి కరెంటు కేబుల్స్ పై కార్బన్ పదార్థాలు అతుక్కుపోతున్నాయి. దీంతో కేబుల్స్ పనిచేయకుండా ఆగిపోతున్నాయి.
ఉప్పల్ నాగోల్లో మెట్రో రైలుకు కాలుష్యం కారణంగా ఎదురవుతున్న సమస్యలను కాలుష్య నియంత్రణ బోర్డు దృష్టికి తీసుకొచ్చినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అంతేకాదు సీనియర్ అధికారుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇక కాలుష్యం కారణంగా మెయిన్టెనెన్స్ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రారంభమైన ఆరునెలల్లోనే రెండు సార్లు నిలిచిపోయిన మెట్రో రైళ్లు
మెట్రో రైలు ప్రారంభం అయిన ఆరునెలల్లోనే ఇలా రైళ్లు నిలిచిపోయిన ఘటనలు రెండు సార్లు జరిగాయి. రైలు నిలిచిపోయిన సమయంలో ఉప్పల్ అమీర్పేట్ రూట్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ఈ రూట్లోనే అత్యధిక సంఖ్యలో ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం కేబుల్ వైర్ల మరమత్తు ఉప్పల్ డిపోలో చేపట్టారు అధికారులు. అంతేకాదు మెయింటెనెన్స్ ఫ్రీక్వెన్సీని కూడా పెంచారు అధికారులు.
త్వరలో మెట్రో స్టేషన్ల వద్ద ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు
కార్బన్ ఉద్గారాల విడుదలను తగ్గించడమే మెట్రో రైలు ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలోనే అధిక సంఖ్యలో వాహనాలు తగ్గించేందుకు పార్కింగ్ సదుపాయం కూడా కల్పించింది మెట్రో సంస్థ.కొన్ని చోట్ల మాత్రమే పార్కింగ్ ఫీజును వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో కూకట్ పల్లి, మియాపూర్, ఎల్బీనగర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయనుంది మెట్రో యాజమాన్యం.ఇక మెట్రో స్టేషన్ల నుంచి ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలను హైదరాబాద్లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది మెట్రో. ఈ తరహా ప్రయోగం చెన్నై మెట్రో లో మంచి ఫలితాలను కనబర్చింది.