వైసిపికి మనుగడలేదు: పొంగులేటి, మా పొట్టగొట్టేందుకే జగన్: కెటిఆర్
ఖమ్మం: తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని, అది ఆంధ్రా పార్టీగా ముద్రపడిందని, అందుకే తాను తెరాసలోకి వెళ్తున్నట్లు ఖమ్మం ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి సోమవారం నాడు చెప్పారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, పార్టీని బతికించుకోలేకపోయానని చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. ఖమ్మంలో వైసిపిని నిలబెట్టానని తెలిపారు. తెలంగాణలో వైసిపి వెంట ప్రజలు నడిచే పరిస్థితి లేదని చెప్పారు. ఉదయం కార్యకర్తలతో సమావేశమై, చర్చించిన తర్వాతనే తాను ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు.
తెలంగాణ రైతుల పొట్ట కొట్టేందుకే జగన్: కెటిఆర్
తెలంగాణ రైతుల పొట్ట కొట్టేందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దీక్ష అంటూ చెబుతున్నారని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధ్వజమెత్తారు.
కెటిఆర్ సోమవారం ఎంపీ పొంగులేటి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తెరాసలోకి ఆహ్వానించారు. కెటిఆర్ మాట్లాడుతూ... తెలంగాణలో రాజకీయశక్తుల పునరేకీకరణ జరుగుతోందన్నారు. తెలంగాణలో వైసిపి శకం ముగిసిందని చెప్పారు. త్వరలో టిడిపి శకం ముగుస్తుందన్నారు కాగా, ఎల్లుండి కెసిఆర్ సమక్షంలో పొంగులేటి, పినపాక ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు తెరాసలో చేరనున్నారు.