విదేశీ టూర్లలో మోడీ గిన్నిస్ రికార్డ్: పొంగులేటి, మండిపడ్డ శివసేన
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి గురువారం నాడు నిప్పులు చెరిగారు. రెండేళ్ల తన పాలన పైన బీజేపీ హడావుడి చేస్తోందని దుయ్యబట్టారు. రెండేళ్లలో ప్రజలకు ప్రధాని మోడీ చేసిందేం లేదన్నారు.
ప్రధాని మోడీ స్వదేశం కన్నా విదేశాల్లోనే ఎక్కువగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. విదేశీ పర్యటనలతో ప్రధాని గిన్నిస్ రికార్డులకు ఎక్కారని విమర్శించారు. మోడీ దేశాభివృద్ధి విషయంలో చెప్పింది కొండంత అయితే, చేసింది గోరంత అన్నారు.
మోడీ విదేశీ పర్యటనల పైన శివసేన ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోడీ భారత పౌరుడా? లేక ప్రవాస భారతీయుడా? అన్నది ముందు తేల్చుకోవాలని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోడీ తరచూ విదేశీ పర్యటనలు చేస్తుండటాన్ని విమర్శిస్తూ.. పార్టీ అధికార పత్రిక సామ్నాలో రాశారు.
ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్కచోట మాత్రమే ఆ పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. మిగతా నాలుగు రాష్ట్రాల్లో కనీస ప్రభావం చూపలేకపోయారన్నారు. దానిని మరచి సంబరాలకు ఎలా సిద్ధమౌతారని ప్రశ్నించింది.
ప్రధాని మోడీ ఎన్ని సంక్షేమ పథకాలు ప్రారంభించినా అవి క్షేత్ర స్థాయిలో ప్రజలకు దగ్గర కావడం లేదని పేర్కొంది. ఇక్కడ కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టి విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని తిరిగి వెనక్కు తెప్పించడంలోనూ ప్రధాని మోడీ సర్కారు విఫలమైందన్నారు.