‘రుజువు చేస్తే అసెంబ్లీ ముందు ఉరేసుకుంటా’
వరంగల్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రభుత్వ విధానాలు, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'దళితుల భూములను ఆక్రమించుకున్నానని తెరాస నేతలు నాపై ఆరోపణలు చేస్తున్నారు.. వాటిని రుజువుచేస్తే అసెంబ్లీ ముందే ఉరేసుకుంటా'నని పొన్నాల లక్ష్మయ్య తేల్చి చెప్పారు.
వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో పొన్నాల మీడియాతో మాట్లాడుతూ.. ఛాతీ ఆస్పత్రి తరలింపుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాము నిర్వహించిన పాదయాత్రలో తనపై దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా పాదయాత్ర చేయడం నేరమా? అని పొన్నాల ప్రశ్నించారు. ఈ సందర్భంగా తనపై జరిగిన దాడిని గ్రామస్థులు, మీడియాకు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్న తనను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని అన్నారు. ఇందులో భాగంగానే తనకు భద్రతను తగ్గించిందన్నారు. ఆచరణ సాధ్యం కాని పథకాలతో ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని పొన్నాల ఆరోపించారు.
కెసిఆర్పై కోమటిరెడ్డి ఫైర్
నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్కు మహిళలపై, దళితులపై ప్రేమ లేదని, అందుకు నిదర్శనం క్యాబినెట్లో మహిళలకు, దళితులకు చోటు కల్పించక పోవటమేనని సీఎల్పీ ఉప నేత, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెసేనని చెప్పారు.
అమలు కాని హామీలిచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శించారు. దళితులకు భూ పంపిణీ ఊసే లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో విఫలమయ్యాడని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆదర్శ పాలన కొనసాగిస్తానని చెప్పి మరో వైపు రెచ్చగొట్టే చర్యలను ప్రోత్సహిస్తున్నాడని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇలాంటి చర్యలను సహించరని చెప్పారు.