అవమానాలు: డిఎస్ దారిలోనే పొన్నాల కారెక్కుతారా?
హైదరాబాద్: తెలంగాణ మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సీనియర్ నేత డి. శ్రీనివాస్ దారిలో నడుస్తారనే ప్రచారం సాగుతోంది. పొన్నాల లక్ష్మయ్య కూడా తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరేందుకు సిద్ధపడినట్లు చెబుతున్నారు
కాంగ్రెసులో తనకు అడుగడుగునా అవమానాలు ఎదురువుతున్నాయని మాజీ మంత్రి కూడా అయిన పొన్నాల లక్ష్మయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.. దీంతో ఆయన అధికార తెలంగాణ రాష్ట్ర సమితి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. పిసిసి పదవి నుంచి తనను తొలగించడంతో పాటు పలు రకాలుగా తనను కాంగ్రెసు నాయకత్వం అవమానించిందని ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత పార్టీ కష్టాల్లో ఉన్న పరిస్థితిలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా తెలంగాణ పిసిసి బాధ్యతలను భుజానేసుకున్నారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు టీ పీసీసీ చీఫ్ బాధ్యతలను తప్పుకుని, వాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించిన విషయం తెల్సిందే.
అప్పటి నుంచి పొన్నాలకు పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఆహ్వానం అందడంలేదు. తాజాగా గాంధీ భవన్లో వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికపై అత్యున్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ భేటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, వరంగల్కు చెందిన పార్టీ నేతలు హాజరయ్యారు. అయితే వరంగల్ జిల్లాకే చెందిన పొన్నాలకు మాత్రం ఆహ్వానం అందలేదు.
సమావేశం ప్రారంభమైన తర్వాత జరిగిన పొరపాటును ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసుకున్నారు. వెంటనే అక్కడి నుంచే పొన్నాలకు ఫోన్ చేశారు. పొరపాటు జరిగిపోయిందని, పెద్ద మనసు చేసుకుని సమావేశానికి రావాలని ఆహ్వానించారు. దాంతో పొన్నాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.