కేసీఆర్ కాపలా కుక్క, మోసగాడు: విరుచుకుపడిన పొన్నాల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విరుచుకుపడ్డారు. మంత్రి పదవి దక్కలేదనే అక్కసుతో పార్టీ పెట్టిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పారని, ఎన్నికల్లో గెలవడం కోసం దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మోసం చేశాడని ధ్వజమెత్తారు.
అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని పొన్నాల ప్రశ్నించారు. గాంధీభవన్ లో సోమవారం నిర్వహించిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన కేక్ కోసి, మిఠాయిలు పంచారు.
అనంతరం మాట్లాడుతూ కొన్నిస్వార్థ రాజకీయ శక్తులు కాంగ్రెస్ది కుటుంబపాలన అంటూ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. ఈ దేశ తొలి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ దేశ స్వాతంత్ర్యం కోసం జైలుకెళ్లారని గుర్తుచేశారు.
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసమే తమ ప్రాణాలను త్యాగం చేశారని, దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించే అవకాశం ఉన్నా సోనియాగాంధీ.. పార్టీలో సీనియర్ నాయకులకు అవకాశం ఇచ్చారన్నారు.
ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా దేశ ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూస్తున్నారని, దేశానికి భవిష్యత్తు నేతగా ఆయన ఎదిగారని ప్రశంసించారు. ఇలాంటి చరిత్ర ఉన్న కాంగ్రెస్ గురించి అవాకులు చెవాకులు పేలటం మంచిది కాదన్నారు. టీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలను, పెన్నులను ఉచితంగా పంపిణీ చేశారు.