కేసీఆర్.. జాతీయపార్టీ పెడతావా? వరంగల్లో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు: పొన్నాల లక్ష్మయ్య
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మాజీ టీపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేడు కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఆయన కేసీఆర్ ను టార్గెట్ చేశారు. కేసీఆర్ యాదాద్రి పర్యటన పైన, జాతీయ పార్టీ ఏర్పాటు పైన పొన్నాల లక్ష్మయ్య ముఖ్యమంత్రి ని టార్గెట్ చేస్తూ అనేక ప్రశ్నలు సంధించారు.
దోపిడీ చేసి దేవుళ్ళ దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి కి వెళ్లారని, అక్కడ భగవంతునికి ఒక కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించారని పేర్కొన్న పొన్నాల లక్ష్మయ్య చేసిన పాపాలకు దేవుడికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు కెసిఆర్ అంటూ పేర్కొన్నారు. దోపిడీ చేసి దేవునికి దండం పెట్టాలనుకుంటున్నాడు కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు.
వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయినట్టు ఈ పెద్ద పిల్లి వేల కోట్లుదోచుకొని గుళ్లకు పోతున్నాడు అంటూ మండిపడ్డారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇంత దారుణంగా దోపిడీ చెయ్యలేదని పేర్కొన్న పొన్నాల లక్ష్మయ్య, ప్రజలు మానవీయ కోణంతో ఇచ్చిన అవకాశాన్ని దోపిడీ కోసం కెసిఆర్ ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ జాతీయ పార్టీ దోపిడీ కోసమే
రెండు మూడు రోజుల్లో కొత్త పార్టీ పెడుతున్నాడని దేవుడి దర్శనానికి పోయాడా ? అని ప్రశ్నించిన పొన్నాల లక్ష్మయ్య, కెసిఆర్ జాతీయ పార్టీ కూడా దోపిడీ కోసమే పెడుతున్నాడని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
ఇక వరంగల్ సందర్శన నేపథ్యంలో వరంగల్ జిల్లా ను ఏ విధంగా కెసిఆర్ అభివృద్ధి చేశారో చెప్పాలంటూ పలు ప్రశ్నలను సంధించారు పొన్నాల లక్ష్మయ్య. దేవాదుల ప్రాజెక్టుకు ఈ 8 ఏళ్లలో 3 పేజ్ మోటార్లు నడిపి ఒక్క టీఎంసీ అయిన నీరు ఇచ్చారా...? అంటూ ప్రశ్నించారు.
ఎనిమిదేళ్ళ పాలనలో ఏం వెలగబెట్టారు?
ఎనిమిది సంవత్సరాల్లో ఏం వెలగబెట్టారని నిలదీశారు. వరంగల్లో దేవాదుల పై సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. వరంగల్ లో ఎనిమిది సంవత్సరాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం ఒక్క పైసా అయినా ఖర్చు చేశారా అంటూ మండిపడ్డారు. దీనికి రేపు సమాధానం చెప్పాలని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
వరంగల్ అభివృద్ధి కి సంవత్సరానికి 300 కోట్లు ఇస్తా అన్నాడు.. ఇచ్చాడా కెసిఆర్ అంటూ ప్రశ్నించిన పొన్నాల లక్ష్మయ్య మొదట బడ్జెట్ లో 100 కోట్లు పెట్టి నయాపైసా కూడా విడుదల చేయలేదంటూ నిప్పులు చెరిగారు. ఇక వరంగల్ టెక్స్టైల్ పార్కు ఏమైంది అని ప్రశ్నించారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా?
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూములు కట్టిస్తాం అని, మూడు నెలల్లో వస్తా అని కనీసం పునాది కూడా వేయలేదని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో కెసిఆర్ చెప్పినవన్నీ చేశారా? కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఇక వరంగల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏమైంది అని ప్రశ్నించిన పొన్నాల లక్ష్మయ్య 150 కోట్లు ఇచ్చారా అంటూ నిలదీశారు. అక్కడకు వచ్చిన ఎక్విప్మెంట్ చెదలు పడుతోందని మండిపడ్డారు.
కేసీఆర్ శేష జీవితం చంచల్ గూడా జైల్లోనే
2013 డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు మొదలు పెట్టాలని 25 కోట్లు కేటాయించామని పేర్కొన్న ఆయన, కెసిఆర్ హయాంలో ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కి కూడా భూసేకరణ జరిపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. ఇంతవరకు కోచ్ ఫ్యాక్టరీ మొదలు పెట్టింది లేదని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. వరంగల్ లో అధునాతన సౌకర్యాలతో జైలు నిర్మాణం చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదు కాబట్టి కెసిఆర్ శేషజీవితం చంచల్ గూడా జైలు లోనే అంటూ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యలు చేశారు.