ఫిల్మ్సిటీ భూములు: 'కేసీఆర్ మాట మారుస్తున్నారు'
హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీ భూముల అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట మారుస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. గతంలో చెప్పినదానికంటే విరుద్ధంగా ఆయన మాట్లాడుతున్నారని సోమవారం హైదరాబాద్లో మీడియాతో చెప్పారు.
సీఎం కేసీఆర్ మాట మారుస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలే కొంతమంది అంగీకరిస్తున్నారని పొన్నాల అన్నారు. మాట తప్పుతూనే తాను మాట మార్చే వ్యక్తిని కాదని చెప్పడం కేసీఆర్కే చెల్లిందని అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ భూముల వివాదంపై కోర్టులో కేసు నడుస్తోందని అన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతులు, పెన్షన్లు రాని వృద్ధులకు కేసీఆర్ భరోసా ఇవ్వడం లేదన్నారు. వరంగల్ పర్యటనలో నాలుగు వేల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న కేసీఆర్, గతంలో గజ్వేల్లో ఐదు వేల ఇళ్ల కట్టిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక్క గుంట కూడా కబ్జాలో లేదని, అసైన్డ్ భూమీ లేదని, అందులో ప్రతి అంగుళం రామోజీ రావు కష్టపడి కొన్నదేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా హన్మకొండలో అన్న విషయం తెలిసిందే.
కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓ విలేకరి రామోజీ ఫిల్మ్ సిటీ పైన ప్రశ్నలు అడిగారు. దానికి కేసీఆర్ జవాబిచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణానికి ఒక్క గుంట ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేయలేదన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని లక్ష నాగళ్లతో దున్నుతానని తాను ఎన్నడూ అనలేదన్నారు. ఫిల్మ్ సిటీ ఒక అద్భుతమని కితాబునిచ్చారు.