టిఆర్ఎస్లోకి పొన్నాల?: ‘టిఆర్ఎస్ది మైండ్గేమ్-సాక్షి మీడియావి అసత్యాలు’
హైదరాబాద్/వరంగల్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా మరో రాష్ట్ర స్థాయి నాయకుడు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య త్వరలోనే గులాబీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
గతంలో భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాలకు సన్నిహితుడైన ఓ కాంట్రాక్టు సంస్థ అధినేత ఆయనకు, టీఆర్ఎస్ నాయకత్వానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కాంట్రాక్టర్ ఇటీవల హైదరాబాద్లోని తన ఫాంహౌస్లో ఇచ్చిన విలాసవంతమైన విందుకు టిఆర్ఎస్ ముఖ్యులతో పాటు పొన్నాల హాజరైనట్లు తెలిసింది.
ఈ సందర్భంగా టిఆర్ఎస్లో చేరితే తన భవిష్యత్కు కచ్చితమైన హామీ ఇవ్వాలన్న పొన్నాల డిమాండ్ మేరకు టిఆర్ఎస్ సీనియర్ నేతలు కె. కేశవరావు, డి. శ్రీనివాస్ చర్చలు జరిపినట్లు సమాచారం.
వచ్చే మార్చిలో జరిగే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని పొన్నాల కోరినట్లు తెలిసింది. అయితే పార్టీలో చేరిన వెంటనే రాజ్యసభ సభ్యత్వం కట్టబెడితే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్న టిఆర్ఎస్ అధినేత కేసీఆర్... అందుకు ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన కోడలు వైశాలికి వరంగల్ జిల్లా నుంచి శాసనసభకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కూడా పొన్నాల కోరినట్లు తెలిసింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత పొన్నాల గులాబీ కండువా కప్పుకోన్నుట్లు తెలిసింది.
కాగా, వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ, కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిపోయారు. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి టీఆర్ఎస్లో చేరడంతో ఆ జిల్లాలో టీడీపీకి ప్రధాన నాయకుడే లేకుండా పోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్తో పాటు అనేక మంది నేతలు టీఆర్ఎస్లో చేరారు.
ఇటీవలే మాజీ మంత్రి బస్వరాజు సారయ్య గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు పొన్నాల కూడా చేరితే... వరంగల్ జిల్లాలో చెప్పుకోదగ్గ కాంగ్రెస్ నేతల్లో గండ్ర వెంకట రమణారెడ్డి తప్పా మిగితా ఎవరూ లేరనే చెప్పవచ్చు.
మైండ్గేమ్, ప్రాణమున్నంత వరకూ కాంగ్రెస్లోనే
తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ టీఆర్ఎస్ పార్టీపై పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్ లో పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ సీనియర్లపై టీఆర్ఎస్ పార్టీ మైండ్గేమ్ ఆడుతోందని ఆరోపించారు.
తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వరుస కథనాలకు ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టిఆర్ఎస్ ఆ విధంగా విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తాను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారనని తెలిపారు. ప్రాణమున్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పొన్నాల స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని సాక్షి మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తోందంటూ ఆయన తన అనుచరులతో సాక్షి కార్యాలయం ముందు ధర్నా చేశారు.