కోదండరాంకు జనగామ టిక్కెట్పై పొన్నాల స్పందన, టీడీపీలో ఇంకా పోటీదారులు: రేవూరి
జనగామ/హైదరాబాద్: జనగామ సీటు తనదేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం నాడు చెప్పారు. తనలాంటి బీసీ నాయకుడిపై ఇలాంటి ప్రచారం పార్టీకి మేలు చేయదని చెప్పారు. జనగామ సీటును వేరే పార్టీకి ఇస్తే ప్రతిపక్షాలకు మేలు చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
తనలాంటి సీనియర్ నాయకుడి సీటును భాగస్వామ్య పక్షాలకు ఇవ్వడం అంటే ప్రతిపక్షాల దాడికి గురికావడమే అన్నారు. జనగామ సీటు కోదండరాంకు ఇస్తారనేది కేవలం ప్రచారం మాత్రమేనని చెప్పారు. తెలంగాణ జన సమితికి జనగామను కేటాయించాలని హైకమాండ్ అడిగితే తాను సమాధానం చెబుతానని అన్నారు.
14 సీట్లు కాదు, టీడీపీలో ఇంకా పోటీదారులు: రేవూరి
తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు కేటాయించినట్లు కాంగ్రెస్ పార్టీ చెబుతోందని తెలుగుదేశం పార్టీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి చెప్పారు. టీడీపీలో ఇంకా పోటీ దారులు ఉన్నారని తెలిపారు. నర్సంపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తమ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వస్తారని చెప్పారు.
చంద్రబాబుపై మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను తాము ఖండిస్తున్నామని రేవూరి చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగానే చంద్రబాబు లేఖ ఇచ్చారని చెప్పారు. హరీష్ రావు వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని చెప్పారు. దిగువ రాష్ట్రాల హక్కులు కాపాడుకోవడం కోసం లేఖలు ఇవ్వడం సాధారణమని చెప్పారు. మనుగడ కోసమే చంద్రబాబు పైన హరీష్ రావు వ్యాఖ్యలు చేశారన్నారు.