కాంగ్రెస్లో జంపింగ్ జపాంగ్స్ టెన్షన్ : పార్టీ మారే నేతలను స్లిప్పర్తో కొడతానన్న పొన్నం
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కో నేత వెళ్లిపోతుండటంపై ఆ పార్టీ నేతల్లో అసహనం పెరిగిపోతోంది. తమ బీ ఫాం తీసుకొని .. గెలిచి, ఇతర పార్టీలోకి వెళ్లడంపై మదనపడుతున్నారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మరో ముందుడుగు చేసి చెప్పులతో కొడతామని హాట్ కామెంట్స్ చేశారు.
పార్టీ వీడారో ..
కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి .. ఇతర పార్టీల్లోకి నేతలు వెళ్తున్నారు. ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరతామని ప్రకటించడంతో లోలోన కుమిలిపోతున్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఇక స్థానిక సమరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే తరువాయి. ఈ క్రమంలో తమ బీ ఫాం మీద గెలిచి ఇతర పార్టీలోకి వెళితే చెప్పుతో కొడతామని పొన్నం వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇదీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కామెంట్స్ చేస్తున్నానని తెలిపారు పొన్నం ప్రభాకర్.
పొన్నం అఫిడవిట్
సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీచేసినా పొన్నం ప్రభాకర్ తాను గెలిచాక కూడా పార్టీ మారానని అఫిడవిట్ ఇచ్చారు. మీడియా సమావేశం పెట్టి .. అఫిడవిట్ పత్రాన్ని చూపించారు. ఒకవేళ తాను పార్టీ మారితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరరారు. చీటింగ్, క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. అంతేకాదు అఫిడవిట్ పత్రాలను లోక్ సత్తా, స్వచ్చంద సంస్థలు, ప్రజాసంఘాలకు పంపించారు పొన్నం. అందుకే పార్టీ మారే నేతలపై హాట్ కామెంట్స్ చేసినట్టు అర్థమవుతోంది.
కారణమిదీ ?
పొన్నం ఎందుకు అఫిడవిట్ విడుదల చేశారని గతంలోనే మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా .. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానమే అఫిడవిట్ అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు చాలా మంది టీఆర్ఎస్లో చేరారని, నిన్ను గెలిపించినా అదే పని చేస్తావా? అని కొన్ని చోట్ల ప్రజలు ప్రశ్నించారని.. అందుకే అఫిడవిట్ విడుదల చేసినట్లు వెల్లడించారు.