'హరీష్ రూపంలో కెసిఆర్కు పదవీగండం: కొడుకు, కూతురు తిరగబడతారనే భయం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు అల్లుడు హరీష్ రావు రూపంలో పదవీగండం పొంచి ఉందని, తన ప్రభుత్వాన్ని ఎక్కడ కూల్చుతారోనే అనే భయంతోనే అటు మండలి చైర్మన్, ఇటు అసెంబ్లీ స్పీకర్ను వెంట బెట్టుకొని చైనా పర్యటనకు వెళ్లారని పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్య చేశారు.
కరీంనగర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత అయిన పొన్నం ప్రభాకర్.. మంగళవారం నాడు కెసిఆర్ చైనా పర్యటన పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు రూపంలో పదవీగండం ఉన్నందునే అభద్రతాభావంతో మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారిని వెంట తీసుకెళ్లారన్నారు.
చైనా నుంచి వచ్చేసరికి అల్లుడు లేదా కొడుకు, కాకుంటే బిడ్డ ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్నది ఆయన భయమన్నారు. రైతుల ఆత్మహత్యలు పట్టించుకోకుండా వాటి కారణాలు వెతికి నష్ట నివారణ చర్యలు తీసుకోకుండా విదేశీ పర్యటనలకు వెళ్లడం కెసిఆర్ మూర్ఖత్వమన్నారు.
రోమ్ రాజును తలపించేలా కేసీఆర్ పాలన సాగుతోందన్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఆ రాజు ఫిడేల్ వాయించినట్లుగా.. దానిని మరిపించే రీతిలో కెసిఆర్.. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా స్పందించడం లేదని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే: కిషన్ రెడ్డి
ఇందిరా పార్క్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకే ఆత్మహత్యలు అన్నారు. రైతుల పైన కెసిఆర్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందన్నారు.
రుణమాఫీ విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. రైతుల రుణాలు ఒకే దశలో మాఫీ చేయాలన్నారు. రైతులు అప్పుల భారం పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశార. కెసిఆర్ నిర్లక్ష్య పాలన వల్ల ఇప్పటి వరకు వెయ్యి మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.