'తెరాసలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వైపు కేసీఆర్ ఎదురుచూపు'
హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన ప్రజాప్రతినిధులు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. అప్పుడే జంపింగ్ ప్రచారం సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తెరాసలో చేరుతారనే ప్రచారం సాగింది. దీనిపై టీడీపీ, కాంగ్రెస్ వర్గాలు భగ్గుమన్నాయి.
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోసం ఎదురుచూపు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేబినెట్ విస్తరణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కోసం ఎదురు చూస్తున్నారని, తెరాసలో సమర్థులు లేరా అని ఆయన ప్రశ్నించారు. శాసన మండలి సభ్యులను తెరాసలో విలీనం చేయడం సరికాదని, కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన నేతల ఇంటి ముందు చావు డప్పుకొట్టి శవయాత్రలు చేయాలని పార్టీని కోరానని చెప్పారు. తాము ఓటమితో కుంగిపోలేదని చెప్పారు. ఓటమికి కారణాలను విశ్లేషిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించకుండా తిరుగుతున్నారని కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు.
మౌనం ఎందుకు?
రాఫెల్ ఇష్యూపై తెరాస ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే విభజన హామీలపై పోరాడుతున్నట్లు తెరాస ఎంపీలు నటిస్తున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ ఇక దుకాణం మూసుకోవాలని ఎద్దేవా చేశారు.
శాసన మండలి ప్రతిపక్ష హోదా రద్దు
కాగా, శనివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతున్నారనే ప్రచారం సాగింది. అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తెరాసలో చేరారు. కొండా మురళీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రద్దయింది. ఈ మేరకు మండలి కార్యదర్శి నర్సింహాచార్యులు శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. విపక్ష నేత షబ్బీర్ అలీకి ఆ హోదాను రద్దు చేశారు. కాంగ్రెస్ సభ్యులు ఆకుల లలిత, సంతోష్ కుమార్, దామోదర్ రెడ్డి, ప్రభాకర రావులు శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చేయడంతో ఆ పార్టీ తరఫున విపక్ష నేత షబ్బీర్ అలీ, ఉప నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మిగిలారు. విపక్ష హోదాకు నలుగురు సభ్యులు అవసరం కాగా ఇద్దరే ఉండడంతో హోదా రద్దయింది.
ఎమ్మెల్సీల రాజీనామా
శాసనమండలి వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గ సభ్యుడు కొండా మురళీధర రావు తన పదవికి రాజీనామా చేశారు. ఛైర్మన్ స్వామిగౌడ్కు రాజీనామా లేఖ అందించారు. దానిని ఛైర్మన్ ఆమోదించారు. కొండా మురళి 2016లో తెరాస నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు. శాసనసభ ఎన్నికల్లో కొండా సురేఖకు టికెట్ ఇవ్వలేదు. దీంతో వారు కాంగ్రెస్లో చేరి, పరకాల నుంచి పోటీ చేసిన ఓడిపోయారు. తమ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన కొండా మురళి, యాదవరెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డిలపై అనర్హత వేటు వేయాలని తెరాస కోరింది. దీనిపై ఛైర్మన్ స్వామిగౌడ్ వారికి నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మురళి రాజీనామా చేశారు. మిగతావారు సంజాయిషీ ఇవ్వడానికి సోమవారం వరకు గడువు ఉంది.