'ఎథిక్స్ పోగొట్టాడు!, అప్పట్లో ఎన్డీ తివారీ భ్రష్టు పట్టిస్తే.. ఇప్పుడు నరసింహన్'
ఎన్డీ తివారీ రాసలీలలు చేసి రాజభవన్ విలువను నాశనం చేస్తే.. నరసింహన్ రాజ్ భవన్ ఎథిక్స్ పోగొట్టాడని మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ పట్ల మొదలైన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్.. గవర్నర్ తీరుపై కూడా అసహనంతో ఉంది.
తాజాగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గవర్నర్ నరసింహన్పై అసహనం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఆయనకొక భజనశాఖ క్రియేట్ చేస్తే సరిపోతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ల పాలనపై అభిప్రాయం చెప్పాలని కోరగా.. ఆయన గవర్నర్ నరసింహన్ను విషయంలోకి లాగారు.
ఎవరో ఒకరు సంస్థ పెట్టుకుని అగ్రికల్చర్ అవార్డుకు కేసీఆర్ ను ఎంపిక చేస్తే గవర్నర్ ప్రశంసలు గుప్పిస్తారని ఎద్దేవా చేశారు. కనీస నైతిక ప్రమాణాలు ఉండాలి కదా.. అని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఎన్డీ తివారీ రాసలీలలు చేసి రాజభవన్ విలువను నాశనం చేస్తే.. వేరే పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేతో మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయించి నరసింహన్ రాజ్ భవన్ ఎథిక్స్ పోగొట్టాడని మండిపడ్డారు. ఈ ముగ్గురి గురించి ఇంతకన్నా ఏం మాట్లాడుతామంటూ ముగించారు.