అబద్ధాల ప్లీనరీ, మోసాలపై ‘కేసీఆర్ అనే నేను’ సినిమా తీస్తాం: పొన్నం సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుది నోరా.. మొరా అంటూ దుయ్యబట్టారు.
అధోగతి ప్రాంగణం
టీఆర్ఎస్ ప్లీనరీ జరగుతున్నది ప్రగతి ప్రాంగణం కాదని.. తెలంగాణను అధోగతి చేసే ప్రాంగణం అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని సాక్షాత్తు మండలిలో కేసీఆర్ చెప్పిన విషయాన్ని పొన్నం గుర్తు చేశారు.
అబద్ధాలు, భజనల వేదిక
ప్లీనరీలో కనీసం సోనియాను తలుచుకోకపోవడం దారణమని, తెలంగాణ ఇచ్చిన వారిని గౌరవించుకునే సంస్కారం కేసీఆర్కు లేదంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్లీనరీ అబద్ధాలకు, భజనలకు వేదిక అంటూ పొన్నం ఎద్దేవా చేశారు.
మచ్చర్ పహిల్మాన్
దేశంలో అబద్దాల ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే అని పొన్నం అన్నారు. ప్లీనరీ కోసం పదవ తరగతి ఫలితాలను వాయిదా వేయడం ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ మచ్చర్ పహిల్మాన్ అంటూ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ అనే నేను
కేసీఆర్ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని పొన్నం అన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే అని విమర్శించారు. కేసీఆర్ అబద్దాలు, మోసాల మీద 'కేసీఆర్ అనే నేను' సినిమా తీస్తామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.